Tirupati: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాధి మంది భక్తులు ఆలయానికి వెళ్తారు. ప్రతి రోజు దేశ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సాధారణంగా తిరుమలు వచ్చే భక్తులు ముందుగానే అధికారిక వెబ్ సైట్లో టికెట్లను బుక్ చేసుకుంటారు. కానీ కొందరు మధ్య వర్తుల ద్వారా టికెట్లు బెక్ చేసుకుంటుండంతో టీటీడీ ,భక్తులకు కొన్ని సూచనలు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు తమ ఆధార్ నెంబర్తో పాటు చిరునామా సహాయంతో టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది. అంతే కాకుండా మధ్యవర్తులను ఆశ్రయించి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవద్దని కోరింది.
శ్రీ వారి కళ్యాణోత్సవం కోసం ఆగస్టు 22 వ తేదీ గురువారం తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు ఉదయం వైకుఠంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. టీటీడీ అధికారులు వారిని గుర్తించి విచారించగా తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహించే వ్యక్తి పాస్ పోర్టు చివరి నెంబర్లను మార్చి ఆన్ లైన్లో కళ్యాణోత్సవం టికెట్లను బుక్ చేసి పెద్ద మొత్తంలో అమ్మినట్లు తెలిసింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Also Read: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు
ముఖ్యంగా దర్శనం కోసం టికెట్ల బుకింగ్ కోసం కొందరు దళారులు భక్తులు నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. మధ్య దళారులను తొలగించేందుకు టీటీడీ యాజమాన్యం నిర్విరామంగా కృషి చేస్తోంది. దర్శనం కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులు పడకూడదని టీటీడీ వెల్లడించింది. సాధారణంగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల దర్శనానికి వెళ్లే ముందు టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తారు. ఒక వేళ భక్తులు బుక్ చేసుకున్న టికెట్లు నకిలీవని తేలితే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దర్శన టికెట్లు, సేవా టికెట్లు వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు.