మహానటుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి వేళ కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు.
భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు లాంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రశంసించారు. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరని పురందేశ్వరి తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.ఎన్టీఆర్ అన్ని తరాలకు ఆదర్శ హీరో అని పురందేశ్వరి చెప్పారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న ఎన్టీఆర్ జన్మించారు. స్వయం కృషితో ఎదిగారు. సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. ఆ మహనీయుడి సేవలకు గుర్తుగా శత జయంతి వేళ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో ఈ స్మారక నాణేన్ని తయారు చేశారు. ఈ విషయంపై మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేశారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలపై 20 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను రాష్ట్రపతి ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు.