NTR : తెలుగువారి అభిమాన నటుడు, మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను హైదరాబాద్ కూకట్పల్లిలోని కైత్లాపూర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ మహనీయుడి శతజయంతి వేడుకలు ఇటీవల విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. నేడు హైదరాబాద్ లో శత జయంతి ఉత్సవాలు జరపనున్నారు. తెలుగుజాతి కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటిన ఆయన సేవలను స్మరించుకోనున్నారు.
పార్టీలకు అతీతంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బాలకృష్ణ, పవన్కల్యాణ్, రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకోబోతోంది. చంద్రబాబు, ఎన్టీఆర్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఫ్యామిలీ పరంగా చంద్రబాబు, ఎన్టీఆర్ అప్పుడప్పుడు కలుసుకుంటారు. కానీ ఇలా బహిరంగ వేదికపై కనిపించనుండడం చాలా రోజుల తర్వాత జరుగుతున్న పరిణామం. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తారక్ పొలిటికల్ ఎంట్రీ కోసం డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య పలకరింపులు ఎలా ఉండబోతాయనే ఉత్కంఠ నెలకొంది.
ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని గత కొంతకాలంగా అభిమానుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. చంద్రబాబు మీటింగ్స్ లోనూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేయడం చాలా సార్లు జరిగింది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన RRR సినిమాకు ఆస్కార్ వచ్చిన సమయంలో చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ థాంక్యూ మామయ్య అంటూ రిప్లై ఇచ్చారు.
కూకట్ పల్లి కైత్లాపూర్ లో జరిగే శతజయంతి వేడుకలకు.. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులతోపాటు.. టీడీపీ కార్యకర్తలు భారీ హాజరుకానున్నారు. దీంతో ఈ సభలోనూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై డిమాండ్స్, నినాదాలు వినిపించే అవకాశం ఉంది. చంద్రబాబు, ఎన్టీఆర్ ఒకే వేదికపై ఉంటారు కాబట్టి.. తమ్ముళ్ల డిమాండ్స్ పై ఇద్దరు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.