Notices TO IPS Officer Kranthi Rana Tata in Jethwani case: ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు విచారణలో ఏపీ పోలీసులు వేగం పెంచారు. జెత్వానిని వేధించినట్లు ఆధారాలు లభించడంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డెహ్రాడూన్లో విద్యాసాగర్ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. అదలా ఉంటే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్న ఐపీఎస్ అధికారి కాంతి రాణాకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే కాంతి రాణాపై సస్పెన్షన్ వేటు వేయగా.. నెక్స్ట్ ఆయనే కటకటాల పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ను ఏపీ పోలీసులు డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. పోలీసలు కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న విద్యాసాగర్ని సెల్ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నటి జత్వానీని వేధించిన కేసులో సస్పెండైన కాంతి రాణా యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. అలాగే ఇదే కేసులో సస్పెండైన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.
జగన్కు సన్నిహితుడు, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కి లబ్ధి చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు జత్వానీని టార్గెట్ చేశారన్న ఆరోపణలున్నాయి. దానికోసం గతంలో జెత్వానీతో పరిచయం వున్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కాదంబరి జెత్వానీని అరెస్టు చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా జెత్వానీని రిమాండ్కి పంపించారు. ఈ అక్రమ వ్యవహారానికి ఆద్యుడైన కుక్కల విద్యాసాగర్ని పోలీసులు అరెస్టు చేశారు.
సినీ ఇండస్ట్రీతో పరిచయాలున్న కుక్కల విద్యాసాగర్.. సినీ నిర్మాతనని చెప్పుకుంటాడు. సడన్గా పాలిటిక్స్ మీద ప్రేమ పుట్టుకొచ్చిన అతను 2014 ఎన్నికల ముందు వైసీపీ నాయకుడి అవతారమెత్తాడు. ఆర్థికంగా స్థితిమంతుడవ్వడంతో.. ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోయినా జగన్ అతనికి కృష్ణాజిల్లా పెనమలూరు టికెట్ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బోడే ప్రసాద్ చేతిలో 31.5 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలైన కుక్కల మళ్లీ పొలిటికల్ స్క్రీన్పై కనిపించలేదు.
Also Read: 300 ఏళ్ల చరిత్రకి మరకలు పడ్డాయా.. తిరుపతి లడ్డూ గురించి ఎవరికీ తెలియని నిజాలు
ముంబై నటి కాదంబరి జెత్వాని కేసుతో తిరిగి ఫోకస్ అయిన విద్యాసాగర్ని తాజా విజయవాడ పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో సినీ నిర్మాతగా చెప్పుకునే విద్యాసాగర్ నంబర్ వన్ నిందితుడు. వైసీపీ హయాంలో రాజకీయ ఒత్తిళ్లతో జెత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులను నిబంధనలు పాటించకుండా అరెస్టు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదుపై నటిని అరెస్టు చేశారు.
ఆ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితని కలిసిన జెత్వాని తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. విద్యాసాగర్ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 42 రోజుల పాటు జైలులో ఉన్న జెత్వానీ, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నేతలు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో నటిని ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసు అధికారుల బృందం ముంబైలో అరెస్టు చేసింది. ఈ పోలీసు బృందానికి అప్పటి విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని నాయకత్వం వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పటి పోలీసు డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి. సీతారామ ఆంజనేయులు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కంతి రాణా టాటా, డిఎస్పీ విశాల్ గున్నిలపై సస్పన్షన్ వేటు వేసింది. ఈ కేసులో వారితో పాటు మరికొందరు అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చే అవకాశం ఉందంటున్నారు.
ఆ క్రమంలో జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకముందే.. ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తుండటం విశేషం.. కాంతిరాణా పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా.. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని.. తప్పుడు సాక్ష్యాలు పుట్టించి తనను ఇబ్బందిపెట్టినట్లు జెత్వానీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విద్యాసాగర్ ను అరెస్టు చేయడంతో .. నెక్ట్స్ తననే విచారించి కీలక విషయాలను బయటకు లాగి కేసులు పెట్టే అవకాశం ఉందని భావించిన రాణా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.