No Ticket for Palle Raghunatha Reddy : మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. అనంతపురం జిల్లా రాజకీయాల్లో పేరున్న నాయకుడు. టీడీపీలో మంత్రిగా, చీఫ్ విప్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ని ఘనతలు ఉన్నా ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు మీన మేషాలు లెక్కించారు.. చివరికి రఘునాథరెడ్డిని కాదని ఆయనకు కోడలకి టికెట్ కేటాయించారు. అసలు ఆ మాజీ మంత్రికి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది ?
పల్లె రఘునాథ రెడ్డి.. టీడీపీ సీనియర్ నాయకుడు.. ఉన్న కొద్దో గొప్పో రెడ్డి సామజిక వర్గానికి చెందిన నాయకుల్లో పార్టీకి లాయల్గా ఉన్న నేత.. పల్లె రఘునాథ రెడ్డి గత 30 ఏళ్ళుగా టీడీపీలోనే కొనసాగుతూ.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులన్న పేరు సంపాదించుకున్నారు. దానికి తగ్గట్లే చంద్రబాబు కూడా ఆయనకు ఒకసారి మంత్రిగా, ఒకసారి చీఫ్ విప్గా, మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ వచ్చారు. అలాంటి 2019 ఎన్నికల్లో పుట్టపర్తి నుంచి ఓటమి తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు.
దాంతో పల్లె అక్కడి నుంచి పోటీకి ఆసక్తిగాలేరన్న వార్తలు బలంగా వినిపించాయి. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రఘునాథరెడ్డి పుట్టపర్తి నుంచి తిరిగి పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తన 30 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని అంత ఉపయోగించినా.. ఆయనకు టికెట్ దక్కడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మొదటి లిస్ట్ లో పేరు లేకపోవడంతో ఇక పల్లె, ఆమర అనుచరులు టికెట్ పై ఆశలు వడిలేసుకున్నారట.
Also Read : తిరుపతి అసెంబ్లీ సీటుపై జనసేనాని ట్విస్ట్.. ఆయన నాన్ లోకల్ అంటున్న నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికలో ఈ సారి ఆచితూచి వ్యవహరించారు. అన్ని సెగ్మెంట్లలో పార్టీ అంతర్గత సర్వేలతో పాటు ఐవీఆర్ఎస్ విధానంతో అభ్యర్ధులపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. పుట్టపర్తిలో కూడ ఫోన్ సర్వే నిర్వహించారు. దానిలో అత్యధిక మంది ఓటర్లు, టీడిపి కార్యకర్తలు పల్లె వైపే మొగ్గుచూపారంట. అయితే మధ్యలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పుట్టపర్తిలో బలంగా ఉండే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన అనేక మంది నాయకుల పేర్లు తెరపైకి వచ్చి పల్లెని టెన్షన్ పెట్టాయి. టీడిపి మరో సీనియర్ నేత నిమ్మల కిష్టప్ప పేరు కూడా ఫోకస్ అయింది. దాంతో పల్లె రఘునాథ్ రెడ్డి కు సీట్ కష్టాలు మొదలయ్యాయి.
అలాంటి తరుణంలో జిల్లాలో జరిగిన రెండు సభలు విజయవంతం చేయడంతో ఆయనపై టీడిపి హై కమాండ్ కు పాజిటివ్ అభిప్రాయం కలిగిందంట. ఒకటి పెనుగొండలో జరిగిన రా కదలిరా ముగింపు సభ.. ఆ సభకు పుట్టపర్తి నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేయడం పల్లె రఘునాథ రెడ్డి కి కలిసివచ్చిందంటున్నారు. మరోకటి నారా లోకేష్ శంఖారావం సభ. పుట్టపర్తి సమీపంలో జరిగిన సభకు భారీ సంఖ్యలో జనం హాజరై.. పల్లె తమఅభ్యర్థిగా ఉండాలంటూ భారీ ఎత్తున హడావుడి చేశారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం వయసు రీత్యా ఈ సారి పల్లె రఘునాథ రెడ్డి కాకుండా ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి సీట్ ఇచ్చే ప్రతిపాదన పెట్టింది.
మొదట్లో దానికి పల్లె ససేమిరా అన్నారట. తాను పోటీ చేసి గెలిస్తే సీనియర్ కాబట్టి మంత్రి పదవి వస్తుందని.. రెడ్డి సామాజిక వర్గం లెక్కలతో మినిస్టర్ పోస్ట్ గ్యారెంటీ అన్న అభిప్రాయంతో చివరి వరకు టికెట్ రేసులో స్వయంగా తనే ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశారంట. ఇవే తనకు చివరి ఎన్నికలని ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారంట. అయితే ఆయన ఆరోగ్యం, వయస్సు ప్రతిబంధకంగా మారాయంట.
Also Read : ఒంగోలు బరిలో హేమాహేమీలు.. తారాస్థాయికి చేరుకున్న చెవిరెడ్డి-మాగుంట విమర్శలు
మరి ముఖ్యంగా నారా లోకేష్ తనకు యూత్ టీం కావాలి అని పట్టుపట్టడంతో.. పల్లె కుటుంబంలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలి అన్న ప్రతిపాదన తెరమీదకొచ్చిందంట. మొదట పల్లె కుమారుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ పేరు పరిశీలించారు. కానీ ఆయన తన విద్యాసంస్థలు , వ్యాపారాలు చూసుకోవడంలో బీజీగా ఉంటారు కాబట్టి.. కోడలు సింధూరను అభ్యర్ధిగా ఫిక్స్ చేశారంటున్నారు.
సింధూరరెడ్డి ఉన్నత విద్యావంతురాలే.. పుట్టపర్తి నియోజకవర్గం లో మొదటి నుంచి పల్లె ఫ్యామిలి పై మంచి అభిప్రాయం ఉంది. ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడం పల్లె కు కలిసి వచ్చింది. మొదటి నుంచి నియోజకవర్గంలో టీడీపి కి వేరే నాయకుడంటూ లేకపోవడంతో ఆ కుటుంబం వైపే టీడీపీ మొగ్గు చూపిందంటున్నారు. పుట్టపర్తి వైసీపీ అభ్యర్ధిగా శ్రీధర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆ స్థాయిలో ఢీకొట్టే అభ్యర్థి టీడీపీలో లేకపోవడం కూడా పల్లె ఫ్యామిలీకి ప్లస్ అయిందంటున్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోవడంతోపల్లె కుటుంబంపై సానుభూతి ఉందని .. అందుకే తిరిగి పల్లె కుటుంబానికే టికెట్ కేటాయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే టికెట్ ప్రకటించే చివరి నిమిషం వరకు తానే అభ్యర్థిగా ఉండాలని ప్రయత్నించిన రఘునాథరెడ్డి.. ఆ కోరిక నెరవేరకపోవడంతో ఒకింత అసంతృప్తిగానే ఉన్నారంట. మొత్తంమీద ఈ సారి పుట్టపర్తి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.