Chandrababu About TDP-Janasena Alliance: విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పునర్మిర్మాణానికి గత తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు నిర్వీర్యం చేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. నేడు టీడీపీ -జనసేన అభ్యర్థుల ప్రకటన సందర్బంగా ఆయన జనసేనాని సమక్షంలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మొండివైఖరితో ఏపీ ఇమేజ్ అంతా డామేజ్ అయిందని వివరించారు. రాష్ట్రంలో సామాన్యుడు నోరెత్తలేని స్థితిలో ఉన్నాడనీ, ప్రశ్నించిన ప్రతిఒక్కరినీ కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారనీ తెలిపారు. విపక్ష నేతగా ఉన్న తననుంచి జనసేనాని వరకూ అందరూ ఆయన నియంత పాలనను భరించాల్సి వచ్చిందన్నారు.
వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి నిండు మనసుతో తాము పొత్తుకు ముందుకొచ్చామని స్పష్టంచేశారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూల్చివేసిన జగన్.. గత ఐదేళ్లలో అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నో సర్వేలు, ఎంతో కసరత్తు తర్వాత తాము ఈ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. దీనికోసం రాష్ట్రంలోని 1.10 కోట్ల మంది అభిప్రాయాన్ని కోరామని చంద్రబాబు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మనసులోని మాటనూ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
సామాజిక వర్గాల వారీగానూ అందరికీ న్యాయం చేసేందుకు తాము శ్రద్ధ తీసుకున్నట్లు నాయుడు వివరించారు. టీడీపీ జాబితాలో యువత, మహిళలు, బీసీలకు గతంలో కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని, 23 మంది ఈసారి తొలిసారి పోటీ చేయబోతున్నట్లు వివరించారు. అభ్యర్థుల్లో 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వైసీపీ మాత్రం గూండాలు, ఎర్రచందనం స్మగ్లర్లను బరిలో నిలుపుతోందని మండిపడ్డారు.
ఈ కీలక సమయంలో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలంతా ఒక్కమాటమీద నిలిస్తే.. కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తమ పొత్తు ఖాయమైన క్షణంలోనే వైసీపీ సర్కారు పతనం ఆరంభమైందని వ్యాఖ్యానించారు. రౌడీఇజం,వలంటీర్ల అండగా నెగ్గాలని వైసీపీ చేసే ప్రయత్నాలేవీ వచ్చే ఎన్నికల్లో ఫలించవని జగన్కు ఇప్పటికే అర్థమైందని అన్నారు.