AB Venkateswara Rao Retirement(AP news today telugu): కక్ష సాధింపు చర్యలు, వేధింపులు.. చివరికి ఆయన న్యాయ పోరాటం గెలిచి.. పదవి విరమణ రోజే బాధ్యతలు చేపట్టి.. సాయంత్రానికి పోలీస్ యూనిఫాంలోనే రిటైర్ అయ్యారు. కానీ.. పదవీ విరమణలో తోటి అధికారుల నుంచి దక్కాల్సిన గౌరవం మాత్రం శూన్యం.
ఐదేళ్లుగా సస్పెన్షన్లపై సస్పెన్షన్లతో, అక్రమ కేసులతో ఏబీవీని వేధించింది ఏపీ ప్రభుత్వం. క్యాట్ ఉత్తర్వులు, హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకుని.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయగా.. మధ్యాహ్నం 12 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. పదవీవిరమణ రోజే బాధ్యతలు చేపట్టిన ఆయన.. సాయంత్రం 5 గంటలకు రిటైర్ అయ్యారు. ఇదంతా ఓకే. కానీ.. రిటైర్ మెంట్ సమయంలో ఆయన వెంటే ఉండి సాదరంగా, సగౌరవంగా సాగనంపాల్సిన అధికారులు మాత్రం రాలేదు.
Also Read : ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, చివరిరోజు సర్వీస్లోకి ఐపీఎస్ అధికారి
డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న అధికారులు రిటైర్ అవుతుంటే.. వారి ఇన్నేళ్ల సర్వీస్ ను గౌరవిస్తూ.. ఐపీఎస్ అధికారులంతా హాజరై.. పూలతో అలంకరించిన వాహనంపైకి ఎక్కించి, ఆయన వాహనాన్ని పూలతాళ్లతో లాగుతూ కార్యాలయం వెలుపలి వరకూ తీసుకెళ్తారు. అనంతరం మరో వాహనంలోకి ఎక్కించి వీడ్కోలు పలుకుతారు. కానీ.. ఏపీ ప్రభుత్వం ఏబీవీపై కక్ష కట్టడంతో.. ఈ వేడుకకు అధికారులెవరూ రాలేదు. ఆయన శ్రేయోభిలాషులు సామాన్య పౌరులే ఆయన్ను సగర్వంగా సాగనంపారు.
ఏబీ వెంకటేశ్వరరావు క్రిస్టల్ క్లియర్ గా బాధ్యతలు తీసుకుని పదవీ విరమణ చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేడా సురేష్ తెలిపారు. దానికి సంకేత సూచకంగా నేచురల్ క్రిస్టల్ ను ఆయనకు అందించారు. కానీ.. ఏదేమైనా ఒక పోలీస్ ఉన్నతాధికారి పదవీవిరమణలో ఇతర పోలీస్ అధికారులు పాల్గొనకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.