Newyear Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏపీ వాసులు తగ్గేదే లే అనే రేంజ్ లో రెడీ అవుతున్నారు. వేడుకలను గ్రాండ్ గా జరుపుకునేందుకు టూరిస్ట్ స్పాట్ లకు వెళ్లిపోతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వైజాగ్ కి పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వైజాగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
కొత్త సంవత్సరాన్ని భారీగా సెలబ్రేట్ చేయడానికి.. హోటల్స్, పబ్స్, రిసార్ట్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. దీంతో వైజాగ్ లో పర్యాటకులతో హోటల్స్, రిసార్ట్స్ నిండిపోయి.. హడావిడి వాతావరణం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. మరింత జాగ్రత్తలు చేపడుతున్నారు. ఒంటిగంట వరకు మాత్రమే విశాఖలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఉంటుందని సీపీ రవిశంకర్ వెల్లడించారు. పబ్, రిసార్ట్, చౌరస్తాల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు ప్రకటించారు.
రాత్రి ఒంటి గంట వరకే వ్యాపారాలను అనుమతిస్తామని.. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలానే రోడ్ల మీద తిరిగే యువతి, యువకులను కూడా పోలీసులు హెచ్చరించారు. బైకులు, కార్లలో బయటికి వెళ్లేవారు తాగి వాహనాలు నడపొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాహనం నడిపేందుకు డ్రింక్ చేయని స్నేహితులను ఎవరినైనా వెంట తెచ్చుకోవాలని సూచించారు. తాగని వారు.. మాత్రమే రిటర్న్ వెళ్లేటప్పుడు డ్రైవింగ్ చేయాలని.. రూల్స్ పాటించకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు.