డిసెంబర్ 15న ఆ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం రాత్రి సరదాగా బైక్ పై బయటకు వెళ్లారు. ఇంతలో ఆ జంట గోదావరిలోకి దూకిందనే వార్త కుటుంబ సభ్యులకు చేరింది. ఈ ఘటనలో వరుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ నవవధువు మాత్రంలో గోదావరిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన వెనుక మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు.
ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవాణి(19)తో డిసెంబర్ 15న వివాహం జరిగింది. వీరు మంగళవారం రాత్రి పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేశారు. వధువు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాకి వెళ్తున్నామని ఆ జంట బైక్ పై బయటకు వెళ్లింది. సిద్ధాంతం వంతెన వద్ద బైక్, వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నాయి.
జరిగిన ఘటనపై వరుడు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల సాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రి ఉన్న శివరామకృష్ణను పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. వరుడిపై వధువు బంధువులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వధువు గల్లుంతుపై అదృశ్యం కేసు నమోదు చేశామని పెనుగొండ ఎస్ఐ రమేష్ తెలిపారు.