Nellore: నెల్లూరు జిల్లాలో పొలిటికల్ సీన్ మారుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో.. పార్టీ నుంచి సస్పెండైన ముగ్గురు కీలక నేతలు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆనం రామనారాయణరెడ్డి,మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఈ ముగ్గురు నేతలు..పసుపు కండువా కప్పుకోనున్నారు.ఇక సైకిల్ సవారీ చేయడం పక్కా అని అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. శుక్రవారం రాత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.. ఇక టీడీపీతో కలిసి నడుస్తానని చెప్పారు. తన అభిప్రాయాన్ని చంద్రబాబు కూడా స్వాగతించారని.. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత అమరావతిలో పార్టీలో చేరుతా అంటున్నారు ఆనం. ఆయన తొలుత జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే చివరికి టీడీపీలో చేరేందుకే మొగ్గు చూపారు.
త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రకటించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ను కలిశారు చంద్రశేఖర్రెడ్డి. లోకేష్ పాదయాత్ర.. ఉదయగిరి జిల్లాలోకి ప్రవేశిస్తుండగా.. స్వాగతం పలికి.. యాత్రను దిగ్విజయం చేస్తానని చెప్పుకొచ్చారు. మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో చర్చలు జరిపారు టీడీపీ నేతలు. ఇప్పటికే ఆయన సోదరుడు టీడీపీలో చేరాడు. రేపోమాపో.. సైకిల్ ఎక్కనున్నారు కోటంరెడ్డి.
నెల్లూరు అంటేనే పెద్దారెడ్ల రాజకీయం. రాజకీయంగా అపర చాణిక్యులు. ఇక్కడి నేతలు వ్యూహం రచిస్తే.. ఢిల్లీలో పార్టీ కూసాలు కదులుతాయని నానుడి సైతం ఉంది. హేమాహేమీలు.. ఇక్కడి నెలపై రాజకీయ ఓనమాలు దిద్ది.. అంచెలు అంచెలుగా ఉన్నస్థాయికి ఎదిగిన నేతలు ఆనం, నేదురుమల్లి, మేకపాటి కుటుంబాలు చక్రం తిప్పాయి. అప్పుట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత.. జగన్ పార్టీ పెట్టాక జిల్లా కాంగ్రెస్ నేతలంతా చేరారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి సత్తా చాటినా.. నెల్లూరు జిల్లాలో మాత్రం.. ఎంపీతో సహా మెజార్టీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. 2019లో ఏకంగా క్లీన్స్వీప్ చేసింది.
అయితే, గత రెండేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలకు పార్టీకి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించారు. ఆనం బహిరంగంగానే సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ ముగ్గురు నేతలు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో.. కోటంరెడ్డి,ఆనం, మేకపాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం.
ఇక నెల్లూరు పెద్దారెడ్ల వింత రాజకీయం జిల్లాలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. త్వరలో టీడీపీ గూటికి చేరబోతున్న…ఆనం రాంనారాయణ రెడ్డికి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సాయం చేశారు. పార్టీ అధినేత జగన్ నియమించిన వెంకటగిరి ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కాదని… ఆనం అనుచరుడిని.. ఎంపీపీగా గెలిపించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల కూడా ఇందుకు సహకరించారు. రాజకీయం ఎలా ఉన్నా.. ఎన్నికల్లో తమ వర్గాన్ని గెలిపించేందుకు.. వైసీపీలో ఉన్న రెడ్లు ఒక్కటి కావడం హాట్ టాపిక్ అయింది.