Nellore : ‘అల్పబుద్ధివానికధికారమిచ్చిన..
దొడ్డవారినెల్ల తొలగగొట్టు..
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా..
విశ్వదాభిరామ! వినుర వేమ!!’’
తాత్పర్యం : అల్పుడికి అధికారమిస్తే మంచివారిని పక్కనపెడతాడు. చెప్పుతినే కుక్కకు చెరకు తీపి తెలియనట్లే చెడ్డవారికి మంచివారి విలువ తెలియదు.
ఈ పద్యాన్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఉద్దేశించి నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెప్పారు. రూప్ కుమార్ యాదవ్ ఎవరోకాదు. స్వయనా అనిల్ కుమార్ యాదవ్ కు బాబాయ్. వారి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనుచరులను చంపే ప్రయత్నాల వరకు కక్షలు పెరిగాయి. రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైసీపీ విద్యార్థి విభాగం నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడు ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హాజీని తాజాగా రూప్కుమార్ యాదవ్ పరామర్శించారు. ఈ దాడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. తనతో ఉన్నాడనే కక్షతోనే హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఈ దాడి వెనుక బాధితుడు చెప్పిన విధంగానే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదని హితువు పలికారు. గతంలోనూ తన అనుచరులపై దాడులు చేశారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదన్నారు.
ఇకపై తన కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాను ప్రతీకారం మొదలుపెడితే ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదని హెచ్చరించారు. ఈ ఘటనను సీఎం జగన్, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నెల్లూరులో వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని రూప్కుమార్ యాదవ్ విమర్శించారు.
అసలే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీలో కుమ్మలాటలు పెరిగాయి. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే నేతల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు మరో వివాదం వైసీపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చింది. ఈ వివాదంపై పార్టీ అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. బాబాయ్, అబ్బాయ్ మధ్య సయోధ్య కుదురుస్తారా..?