Chidambaram Hot Comments on AP CM Chandrababu: మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి ఫుల్ మెజార్టీ రాలేదు. రెండు సార్లు సొంత మెజార్టీతో కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసిన బీజేపీకి తాజా ఎన్నికల్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. మెజార్టీకి ఆమడ దూరంలో బీజేపీ నిలవగా ఇటు చంద్రబాబు నాయుడి టీడీపీ, నితీశ్ కుమార్ జేడీయూ పార్టీలో చెరో భుజం అందించి ప్రభుత్వాన్ని నిలబెట్టినట్టయింది. ఎన్డీయే కూటమిలో అత్యధిక ఎంపీలు ఈ రెండు పార్టీలకే ఉన్నాయి. ఈ రెండు పార్టీల కీలక మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే, వీరిద్దరూ గతంలో బీజేపీకి బైబై చెప్పినవారే. అందుకే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా తలెత్తవచ్చని ప్రతిపక్షాలు అంటున్నాయి.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు నాటికి కూలిపోతుందని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్కు చిరకాల మిత్రుడు జోస్యం చెప్పారు. ఎందుకంటే మోదీ ప్రభుత్వం అంతటి అస్థిరతతో ఉన్నదని పేర్కొన్నారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందా? అని ఓ మీడియా ప్రతినిధి.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరంను ప్రశ్నించారు. ఇందుకు ఆయన చాలా డిప్లమాటిక్గా సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు దేశంలోని కేవలం ఇద్దరు జెంటిల్మెన్లు మాత్రమే సమాధానం చెప్పగలని సెలవిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినాయకుడు నితీశ్ కుమార్లు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరని చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఆ ఇద్దరిని అడగాలని సూచించారు. టీడీపీకీ 16, జేడీయూ 12 లోక్ సభ సీట్లు ఉన్నాయి.
Also Read: Kedarnath: కేదార్నాథ్లో 228 కేజీల బంగారం మాయం.. శంకరాచార్య సంచలన ఆరోపణ
కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలని, ఇది ప్రతిపక్ష పార్టీలకు చాలా అవసరమని చిదంబరం వివరించారు. ఇది అమెరికా అధ్యక్షుడి పదవిలా నిర్ణీత సమయం కలిగి ఉండదని స్పష్టం చేశారు. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని, కాబట్టి, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని వివరించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ఔనని సమాధానం చెప్పారు. సీఏఏను కాంగ్రెస్ కూటమి వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ సీఏఏను వ్యతిరేకించారో లేదో తెలియదని, కానీ, చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో దాన్ని వ్యతిరేకించారని వివరించారు. చంద్రబాబు నాయుడు తన మాటపై ఉంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ అంశంపై తాము ఇప్పుడు ఏమీ చెప్పలేమని, ఒకటి మాత్రం స్పష్టమని తాము సీఏఏను వ్యతిరేకిస్తున్నామని వివరించారు.