Councillor: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది. వైసీపీ, టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. ప్రజాసమస్యలను సభలో ప్రస్తావిస్తున్నారు. టీడీపీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు వంతు వచ్చింది. తన వార్డులోని ప్రాబ్లమ్స్ గురించి వివరిస్తున్నారు. తాను కౌన్సిలర్గా ఎన్నికై మూడేల్లు అవుతున్నా.. ఇంతవరకు ఒక్క పని కూడా చేయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలా మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తాను కౌన్సిలర్గా ఉండి ఏం లాభమంటూ.. ఉన్నట్టుండి తన కాలి చెప్పు తీసుకొని.. తనకు తాను చెంప దెబ్బలు కొట్టుకున్నారు. అంతే. ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.
గడిచిన మూడేళ్లుగా ప్రతీ సమావేశంలోనూ తన వార్డు సమస్యలు చెబుతున్నానని.. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాబ్లమ్ను కూడా అధికారులు సాల్వ్ చేయలేదంటూ వాపోయాడు కౌన్సిలర్ రామరాజు. ఆ ఆవేదనతో ఆయన కన్నీరు కూడా కార్చారు. బాధ తట్టుకోలేక.. అధికారులకు దండం పెడుతూ.. కాలిచెప్పు తీసుకుని ఎడాపెడా తనకు తాను కొట్టేసుకున్నాడు. ఆ దృశ్యం చాలా బాధాకరంగా ఉంది.
కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్న విజువల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. అనకాపల్లి జిల్లాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం కలకలం రేపింది. ఆ దృశ్యం చూసిన వాళ్లంతా అయ్యో పాపం అంటున్నారు. టీడీపీ కౌన్సిలర్ కాబట్టే.. ఆ వార్డులో పనులు జరగకుండా వైసీపీ పాలకులు అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు.