Nellore City : ఏపీలో ఎన్నికలకు 9 నెలల సమయం మాత్రమే ఉంది. అప్పుడే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో ఓటమి తర్వాత జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి జిల్లా వైసీపీ నేతలకు.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సవాల్, ప్రతివాళ్లు విసురుకుంటున్నారు. ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారు.
గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి ఎలాగైనా అధికార పార్టీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు టీడీపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఎక్కడెక్కడ ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తారని స్పష్టం చేసింది.
ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ నుంచి అనిల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి శ్రీధర్ కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగడం ఖాయం. ఇక ఇప్పుడు టీడీపీ నుంచి మరోసారి మాజీ మంత్రి నారాయణ బరిలోకి దిగబోతున్నారు. 2019 ఎన్నికల్లో నారాయణపైనే అనిల్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 19 వేలకుపైగా మెజార్టీతో గెలిచిన అనిల్.. ఫ్యాన్ గాలి బలంగా వీచిన 2019 ఎన్నికల్లో మాత్రం 1988 ఓట్ల స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. అందుకే ఈసారి నెల్లూరు సిటీ ఎన్నిక ఆసక్తిగా మారింది.
ఇప్పటికే నెల్లూరు సిటీలో టీడీపీ గెలుపుఖాయమని లోకేశ్ స్పష్టం చేశారు. లోకేశ్ వ్యాఖ్యలపైనా తాజాగా అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనపై 200 కోట్లు ఖర్చు చేసి గెలవాలని చూస్తున్నారని. ఆరోపించారు. ఎవరు పోటీ చేసినా గెలుపు తనదేనని తేల్చిచెప్పారు. ఓడిపోతే రాజకీయాల తప్పుకుంటానని సవాల్ చేశారు. తన సవాల్ లోకేశ్ స్వీకరిస్తారా? 2024 లో అసెంబ్లీలో అడుగుపెట్టకుండా తనను ఆపగలరా అని లోకేశ్ కు ఛాలెంజ్ చేశారు.