Narayana : ఏపీలో ఇప్పుడు విశాఖలోని రుషికొండ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రుషికొండను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండ పర్యటన మళ్లీ వివాదాన్ని రేపింది.
తాజాగా రుషికొండ పర్యటనకు నారాయణ వెళ్లడం మరోసారి విశాఖలో హీట్ ను పెంచింది. నారాయణ రుషికొండ సందర్శనకు వచ్చిన సమయంలో రుషికొండ వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. నారాయణ రుషికొండ పర్యటనకు బయల్దేరిన సమయంలో ఈ ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనదారులను కాసేపు నిలిపివేశారు.
రుషికొండ పర్యటనకు వెళ్తున్న సమయంలో నారాయణ వాహనాన్ని గీతం యూనివర్సిటీ జంక్షన్ లో పోలీసులు ఆపారు. వాహనంలోని మిగిలిన వారిని దించిన తర్వాతే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నారాయణతోపాటు వాహనంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతలు ఉన్నారు. దీంతో నారాయణ మినహా మిగిలిన వారు దిగిపోవాలని పోలీసులు సూచించారు.
చివరకు కోర్టు అనుమతి మేరకు నారాయణ ఒక్కరినే రుషికొండ పర్యటనకు అనుమతించారు. రుషికొండను పరిశీలించిన తర్వాత నారాయణ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే సహించమన్నారు. రుషికొండలేని విశాఖను ఊహించలేమని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని పాడుచేస్తున్నారన్నదే ఆవేదన అని తెలిపారు.