వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఎంపీ పదవి మన పార్టీదే అన్న ధీమాలో కనిపించారు అక్కడి కార్యకర్తలు .. తమ సిట్టింగ్ ఎంపీ విజయానికి ఢోకా ఉండదని లెక్కలేసుకున్నారు.. అయితే ఉన్నపలంగా అక్కడ వారి ఎంపీ.. అటు పార్టీకి, ఇటు లోక్సభ సభ్యత్తానికి రిజైన్ చేడయంతో.. కేడర్తో పాటు లీడర్లంతా డైలమాలో పడిపోయారు. అధిష్టానమేమో అదేమీ పట్టించుకోకుండా కొత్త అభ్యర్థి వేటలో పడింది. అనేకమంది పేర్లు పరిశీలనలో ఉన్నా.. సరైన కేండెట్ కోసం కసరత్తు చేస్తోందంట అధిష్టానం. అసలా సెగ్మెంట్ ఏది?.. ఆ పార్టీ అంత గందరగోళం ఎందుకు నెలకొంది?
వైసీపీకి, లోక్సభ సభ్యత్వానికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నరసరావుపేటలో కొత్తగా బీసీ అభ్యర్దిని పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తుండటంతో రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందంటూ.. ఆయన రిజైన్ చేశారు. అధిష్టానం లెక్కలు అధిష్టానానికి ఉంటే .. తన లెక్కలు తనకున్నాయంటూ బయటకు వెళ్లిపోయారు.
శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేయడంతో ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థి పరిశీలనలో ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. బుట్టా రేణుక, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి విడదల రజనీల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు బుట్టా రేణుక. కానీ.. ఆమెకు గత ఎన్నికల్లో జగన్ సీటు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో.. ఆమె కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా ఆమెకుతన సొంత ప్రాంతమైన రాయలసీమలో సీటు వచ్చే అవకాశం లేదంట. దీంతో, ఆమెను నరసరావుపేట బరిలో దించాలని జగన్ చూస్తున్నారంట. స్థానికురాలు కాదు కాబట్టి.. జగన్ ప్రతిపాదనను ఆమె ఎంతవరకు స్వాగతిస్తారో తెలియదు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎదురుగాలి వీస్తోందంట. అందుకే ఆయన మీద సానుభూతితో జగన్ ఇక్కడ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారంటున్నారు. అయితే కూడా నరసరావుపేటకు నాన్ లోకలే. మరోవైపు మంత్రి విడదల రజనీని నర్సారావుపేట అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న రజనీ ఈ సారి ఆమె గెలవడం కష్టమని ఇప్పటికే షిఫ్ట్ చేసి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ని చేశారు జగన్. అక్కడ కూడా ఆమెకు వాతావరణం అనుకూలంగా కనిపించడంలేదట.
దాంతో రజనీని నర్సారావుపేట ఎంపీగా పోటి చేయిస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తోందంట. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట సెగ్మెంట్ నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. మరి చిలకలూరిపేటలోనే రజినీకి విజయావకాశాలు లేవని భావిస్తున్న వైసీపీ పెద్దలు.. ఆమె ఎంపీగా ఎలా నెగ్గుకొస్తారో అర్థం కాక అక్కడ వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.
ఆ క్రమంలో పార్టీ పెద్దలు లావు కృష్ణదేవరాయుల్ని వదులుకుని తప్పు చేశారని పల్నాడు వైసీపీ శ్రేణులు ఓపెన్గానే అంటున్నాయి. మొత్తమ్మీద ఎంపీ రాజీనామాతో పల్నాడులో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది . ఓ వైపు అసమ్మతి రాగాలు, మరోవైపు స్థానికి నేతల రాజీనాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే ఇంత వరకూ తీసుకొచ్చాయని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు.
నరసరావుపేట ఎంపీ స్థానంలో బీసీ ఓటర్ల జనాభా ఎక్కువే.. అయితే పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఓసీ నేతలే అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ సారి బీసీ సామాజిక వర్గానికి అక్కడ టికెట్ ఇస్తే గెలుస్తామని వైసీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. ఆ క్రమంలో టికెట్ రేసులో నాగార్జున యాదవ్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.
మరి అభ్యర్ధి విషయంలో అన్ని ప్రత్యామ్నాయాలు ఉంటే.. అధిష్టానం కేండెట్ను ప్రకటించకుండా.. ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందన్న చర్చ కార్యకర్తల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడారు. తాను పోటీ అంటూ చేస్తే నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడాయన ఇతర పార్టీలో చేరి నరసరావుపేట కేండెట్గా బరిలోకి దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అప్పుడు దేవరాయుల్ని ఎదుర్కోవాలంటే.. వైసీపీకి కూడా అన్ని విధాలా బలమైన అభ్యర్ధి అవసరం. ఆ లెక్కలతోనే వైసీపీ నిర్ణయం తీసుకోలేకపోతోందంటున్నారు. దేవరాయులు ప్రత్యర్ధిగా రేసులోకి వస్తే.. ఇప్పుడు ప్రచారంలో ఉన్న పేర్లన్నీ తెరమరుగైపోతాయని వైసీపీ కేడర్ అంటోంది.
మరి ప్రస్తుతం బీసీ నాయకుడైన నాగార్జున యాదవ్ కి సీట్ ఇచ్చినా.. జంగా కృష్ణమూర్తిని బరిలోకి దింపినా.. వారికి దేవరాయుల్ని ఎదుర్కోగలిగే ఆర్థిక బలం లేదన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఎంపీగా నియోజకవర్గంలో గుడ్ విల్ పెంచుకున్న లావు కృష్ణదేవరాయులు నిజంగా ప్రత్యర్ధిగా మారితే.. వైసీపీ ఎవరిని కేండెట్గా ప్రకటిస్తుందో చూడాలి.