Narasapuram MPDO Venkata Ramana Missing Mystery Still unsolved: నర్సాపురం ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. వెంకటరమణ కనిపించడంలేదంటూ ఆయన భార్య ఫిర్యాదు మేరకు.. పెనమలూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే FIR నమోదు చేసి.. ఫోన్ సిగ్నల్స్ను ట్రాక్ చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి మధురానగర్ కెనాల్ వరకు సిగ్నల్ ట్రాకైనట్లు గుర్తించారు. దాంతో మధురానగర్ కాలవలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నిన్న రాత్రి పెద్ద శబ్దంతో కాలువలో ఒక వ్యక్తి దూకినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక ఇటీవలే పవన్ కల్యాణ్కి ఎంపీడీవో వెంకటరమణ ఒక లెటర్ రాశారు. మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు తనని వేధిస్తున్నాడని లెటర్లో పేర్కొన్నారు. 55 లక్షల లీజు డబ్బులను ప్రసాద్ రాజు ప్రభుత్వానికి రానీకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లీజు డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత తనపై.. పడడంతో ఒత్తిడి తట్టుకోలేక సెలవులు పెట్టినట్లు తెలిపారు.
ఈనెల 10 నుంచి సెలవుల్లో ఉండగా.. మొన్న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. లీజు డబ్బులు రికవరీ చేయాలన్న ఉన్నతాధికారుల ఒత్తిడి, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు వేధింపుల కారణంగా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని.. ఎంపీడీవో కుమారుడు కృష్ణ తెలిపారు. 3 నెలల క్రితమే నర్సాపురం ఎంపీడీవోగా విధుల్లో జాయిన్ అయ్యారని అప్పటి నుంచే ఫెర్రీ గొడవలు జరుగుతున్నాయని అన్నారు.
Also Read: పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి
వచ్చే ఏడాది మార్చికి వెంకటరమణ రిటైర్ కానున్నారని ఈ సమయంలో ఆయన సిన్సియారిటీపై దెబ్బకొట్టారని వాపోతున్నారు. ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఎంపీడీవో వెంకటరమణకు ఎలాంటి హాని జరిగినా.. మాజీ ఎమ్మెల్యే, కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఎంపీడీవో కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.