Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర భావోద్వేగం చెందారు. పార్టీ విస్తృతస్థాయిలో ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల కోసం పోరాడిన నేత చంద్రబాబు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారని పేర్కొన్నారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారని లోకేశ్ అన్నారు. జనం గెలిపిస్తే జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని మండిపడ్డారు. ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చారని గుర్తు చేశారు. దళితులు, బీసీలు, మైనారిటీలు, టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
చంద్రబాబు ఏపీకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారని లోకేశ్ అన్నారు. వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగాలు కల్పించినందుకు చంద్రబాబును జైలుకు పంపించారా? అని జగన్ ను ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినందుకు బంధించారా? అని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారని ప్రశ్నించడం తప్పా? అంటూ లోకేశ్ ప్రశ్నలు వేశారు.
గొప్ప రాజధాని నిర్మించాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబును బంధించారని లోకేశ్ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరడం తప్పా? ఇసుక దోపిడీ, కల్తీ మద్యం, కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులపై మాట్లాడటమే నేరమా? అంటూ ప్రశ్నించారు.
ఏనాడైనా తన తల్లి బయటకొచ్చారా? అని లోకేశ్ అన్నారు. కేసులు పెడతామని ఆమెను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారన్నారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తన తల్లికి తెలియవన్నారు. గవర్నర్ను కలిసేందుకు కూడా వెళ్లలేదన్నారు. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనాల్లో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు తమ డీఎన్ఏలోనే లేవన్నారు. చంద్రబాబు ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని లోకేశ్ స్పష్టం చేశారు.