Lokesh: యువగళంతో గళమెత్తారు నారా లోకేశ్. కుప్పంలో పాదయాత్ర ప్రారంభించి.. భారీ బహిరంగ సభతో బల ప్రదర్శన చేశారు. ఏ1 తెచ్చిన జీవో1తో అడ్డుకోవాలని చూశారని.. తన యాత్రకు, పవన్ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. యువగళం ఆగదు, వారాహి ఆగదు.. భయం నా బయోడేటాలోనే లేదు.. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతాం.. అంటూ పంచ్ డైలాగులు పేల్చారు నారా లోకేశ్.
“సైకిల్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి. సైకో పాలనలో అప్పులు.. ఆత్మహత్యలు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. జగన్రెడ్డి అంటే జాదూరెడ్డి. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు.. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఉండవు. యువత, రైతులు.. అన్ని వర్గాలు జగన్ ప్రభుత్వ బాధితులే”..అంటూ లోకేశ్ మండిపడ్డారు.
త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నామంటూ కుప్పం యువగళంలో ప్రకటించారు నారా లోకేశ్. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తామని చెప్పారు. ఏటా డీఎస్సీతో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కలిసికట్టుగా ఉద్యమించి జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దామంటూ నిరుద్యోగ యువతకు పిలుపినిచ్చారు లోకేశ్.
ఇక, వైసీపీ మంత్రులపైనా పంచ్ లు వేశారు నారా లోకేశ్. “యువగళం పాదయాత్ర ప్రకటించగానే 10మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా. నన్ను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. మూడేళ్లలో మీరు రాష్ట్రానికి ఏం చేశారు?” అంటూ వైసీపీ మంత్రులను నిలదీశారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావంటూ పరోక్షంగా కొడాలి నానికి, అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు నారా లోకేశ్.