Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులకు చేరుకుంది. ఇప్పటి వరకు 1268 కిలోమీటర్లు లోకే నడిచారు. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి 100వ రోజు పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. మోతుకూరులో పైలాన్ను ఆవిష్కరించారు.
నారా, నందమూరి కుటుంబసభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్తో కలిసి ఆయన తల్లి భువనేశ్వరి ముందుకుసాగారు. ఇతర కుటుంబసభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు అలా నడుస్తున్న క్రమంలో భువనేశ్వరి షూ లేస్ ఊడిపోయింది. ఈ విషయాన్ని గమనించి లోకేశ్ వెంటనే కింద కూర్చుని తల్లి షూ లేస్ కట్టారు.
పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న వేళ టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బాణసంచా కాల్పులు, డప్పుల మోతతో యువగళం పాదయాత్ర సందడిగా మారింది. దీంతో ఆ సమయంలో బోయరేవుల క్యాంప్సైట్, మోతుకూరు ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్ లోకేశ్ను కలిశారు. యువనేతకు శుభాకాంక్షలు తెలిపారు.