Nara Lokesh latest news(AP news live): ఆంధ్రప్రదేశ్ గంజాయి కేపిటల్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గంజాయిని కంట్రోల్ చేయాలని కోరుతూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉడ్తా పంజాబ్ తరహాలో ఏపీ మారకూడదన్నారు. అందుకే కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశానని చెప్పారాయన. అలాగే తన పాదయాత్రకు భద్రత కలిపించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు లోకేశ్. బడిలో, గుడిలోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అది ఏపీ నుంచే వచ్చిందనే మూలాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. పాదయాత్రలోనూ అనేక కేసులు చూశానని చెప్పారు. కూతురు గంజాయికి బానిస అయ్యిందని పాదయాత్రలో ఓ తల్లి తనకు చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే గంజాయి బ్యాచ్ ఓ ఆడబిడ్డ ప్రాణాలు తీసిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి అమ్మకాల వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు కూడా ముఠాలో భాగస్వాములని ఫైరయ్యారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. రామ్గోపాల్ వర్మ లాంటి వాళ్లతో తన సినిమాల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి.. గంజాయిని అరికట్టేందుకు అధికారులతో మాట్లాడలేకపోతున్నారని లోకేష్ మండిపడ్డారు.
యువగళం పాదయాత్రకు భద్రత కల్పించాలని గవర్నర్రు కోరానని లోకేష్ చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పాదయాత్రలో వైసీపీ ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ పాదాయత్ర చేసిన సమయంలో అవసరానికి మించి భద్రత కల్పించామన్నారు నారా లోకేశ్. కోడి గుడ్లు, రాళ్లతో దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాలంటీర్ల వ్యవస్థపైనా లోకేష్ స్పందించారు. ప్రజా ప్రతినిధులతో కలసి వాలంటీర్స్ పని చేయాలన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం రాజకీయాల కోసం వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటోందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్స్ పనిచేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.