టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై నారా లోకేష్ మండిపడ్డారు . పాముకి కోరల్లో విషం ఉంటుందని కానీ జగన్ కు ఒళ్లంతా విషం ఉంటుందని విమర్శించారు. దొంగ కేసులు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు. బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ కు అధికారమంటే ఎంటో తెలియదన్నారు.
చంద్రబాబు అవినీతి చేశారనడానికి సీఐడీ వద్ద ఆధారాలులేవని నారా లోకేశ్ స్పష్టం చేశారు. అజేయ కల్లాం, ప్రేమచంద్రారెడ్డిపై కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. జగన్ ఆయనపై ఉన్న కేసులకు ప్రజలకు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. జగన్ కు ఉన్న బురద అందరికీ అంటించాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారని మంత్రులు సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఫేక్ కేసుగా లోకేష్ కొట్టిపారేశారు.
జగన్ ను తాను వదిలిపెట్టనని లోకేష్ హెచ్చరించారు. తనను కూడా అరెస్ట్ చేస్తామంటున్నారని రాజమండ్రిలోనే ఉన్నానని అరెస్ట్ చేసుకోండని సవాల్ చేశారు. సీఐడీ అంటే కక్ష సాధింపు డిపార్ట్ మెంట్ విమర్శించారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు, నిరసనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమీక్షించారు. ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలపై ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చించారు. పార్టీ నేతల సూచనలు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్రణాళికకు రూపకల్పన చేశారు. నిరసనల్లో పాల్గొన్న జనసేన, సీపీఐ కార్యకర్తలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. పో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలను అభినందించారు.