Nara Lokesh latest speech(AP politics): వైఎస్ జగన్ పాలనలో విశాఖపట్నం పరిస్థితి దారుణంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖను గంజాయి క్యాపిటల్గా మార్చేశారని విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో లోకేశ్ పాల్గొన్నారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారని మండిపడ్డారు.
ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందని నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ పాలనలో వైజాగ్ ను ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. నాడు సీఎం నారా చంద్రబాబు నాయుడు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు విశాఖలో రోజుకో భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. హత్యలు, కిడ్నాప్ కామన్ గా మారిపోయాయన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. 2 నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read More: టీ గ్లాస్ సింకులో.. సైకిల్ బయట.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి..
విశాఖ రైల్వే జోన్, మెట్రో ప్రాజెక్టు హామీలను సీఎం వైఎస్ జగన్ నెర్చవేర్చలేదని నారా లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబు సూపర్-6 హామీలు ప్రకటించారని వివరించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ఉద్యోగార్థులకు భరోసా ఇచ్చారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని ప్రకటించారు. 18-59 ఏళ్ల లోపు వయస్సున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ప్రకటించారు.
లోకేశ్ శంఖారావం సభలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. టీడీపీ-జనసేన కార్యకర్తలు కలిసి తరలివస్తున్నారు. ఇరుపార్టీల జెండాలు సభా ప్రాంగణంలో రెపరెపలాడాయి. లోకేశ్ మాట్లాడుతున్నంతసేపు టీడీపీ-జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.