Nara Lokesh: ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంటే.. గంజాయి సాగు మాత్రం జోరుగా సాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 224వ రోజు ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో భాగంగా.. లోకేష్ అరబుపాలెం బీసీల నాయకులు, అనకాపల్లిలోని బెల్లం తయారీదారులు, గంగాదేవిపేటలో రైతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. బీసీలపై జగన్ ప్రభుత్వం 26 వేల అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అండతోనే గంజాయి సాగు జరుగుతోందని ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లబెల్లంపై ఆంక్షల్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరకు రైతులకు ప్రభుత్వం తరపున సహకారం అందించి ఆదుకుంటామన్నారు. అలాగే శారదకాల్వ పూడిక తీయించి.. నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం మునగపాకలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లిన లోకేష్.. టీడీపీ ప్రభుత్వం రాగానే అంగన్వాడీల డిమాండ్లన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ బెదిరింపు వ్యాఖ్యలు నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలు నిరసనలు చేస్తే.. వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు చెప్పడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారని విమర్శించిన లోకేష్.. వారి న్యాయపోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.