Nara Lokesh : యువగళం పాదయాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. ఆయాఆయా వర్గాలకు రాజకీయంగానూ ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా పార్టీపై ప్రజల్లో నమ్మకం కలిగే చేయడానికి టీడీపీ యువనేత ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
లోకేష్ ఛాలెంజ్..
తాజాగా పీలేరులో లోకేష్ వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఛాలెంజ్ చేశారు. పులివెందులలాంటి కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని సెటైర్లు వేశారు. వైసీపీ ఇంతవరకు గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్కు ఉందా? అని సవాల్ విసిరారు. టీడీపీకి గతంలో ఏమాత్రం పట్టులేని మంగళగిరిలో గెలిచి కంచుకోటగా మారుస్తానని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపైనా లోకేష్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి చూపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ముందు అయినా సెల్ఫీ దిగి చూపించగలరా? అని ఛాలెంజ్ విసిరితే జగన్ స్వీకరించలేదని లోకేష్ అన్నారు.
ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామికవేత్తలు చెప్పారన్నారు. ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు. ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు . దావోస్ ఒప్పందాలను మళ్లీ విశాఖలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్లో చేసుకున్నారని ఆక్షేపించారు. విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కాదని.. లోకల్ ఫేక్ సమ్మిట్ అని విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో పీపీఏలు రద్దు చేయడంతోపాటు రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారన్నారు. భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమేనని బాగుపడిందని ఆరోపించారు. టీడీపీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని లోకేష్ స్పష్టం చేశారు.