Nara Chandrababu Naidu : చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే.. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే 17Aపైనే వాదనలు వినిపించారు. వాదనలకు మరో గంట సమయం కోరగా.. మూడు రోజులుగా చంద్రబాబు లాయర్లే వాదిస్తున్నారని సీఐడీ లాయర్ ముఖుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17A వర్తించదని ముకుల్ రోహత్గీ వాదించారు. అదే సమయంలో.. అవినీతి నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని సాల్వే ధర్మసనాన్ని కోరారు. క్రిమినల్ కేసుల్లో మళ్లీ కౌంటర్ అఫిడవిట్ల అవసరమేంటన్నారు. దానికి కౌంటర్ గా నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని రోహత్గీ వాదించారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కేసుపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరా తీశారు. ఉన్నతాధికారులను గవర్నర్ రాజ్భవన్కు పిలిపించుకున్నారు. సోమవారం రాత్రి ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి గంటా 20 నిమిషాలపాటు అధికారులు గవర్నర్కు వివరణ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతిపై సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు జరుగుతున్న క్రమంలోనే సెక్షన్17A గురించి గవర్నర్ అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందు ఘటన కాబట్టే గవర్నర్ అనుమతి తీసుకోవాలన్న ప్రస్తావన రాలేదని అధికారులు గవర్నర్కు వివరించారు.