Nara Bhuvaneswari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ వార్త తెలియగానే ఉద్వేగానికి గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లబోతున్నారు. అక్టోబర్ 25 నుంచి “నిజం గెలవాలి” పేరుతో యాత్ర చేపట్టనున్నారు. చంద్రగిరిలో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. భువనేశ్వరి వారానికి 3 రోజులు బాధిత టీడీపీ కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తారు. అలాగే ఆయాఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు.
“నిజం గెలవాలి” యాత్రకు ముందుకు నారా భువనేశ్వరి తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు. భువనేశ్వరితోపాటు కొందరు టీడీపీ నేతలు స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన స్థానికులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అనుమతించలేదు. వారిని ఆలయానికి దూరంగా పంపించారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భువనేశ్వరి నారావారిపల్లెకు వెళ్లారు.