Nagababu Focus on Anakapalli MP Seat(AP political news): అనకాపల్లి ఎంపీ సీటు హాట్కేక్లా తయారైంది. అన్ని పార్టీలో అనకాపల్లి టికెట్ ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇతర రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా జనసేనలో రోజుకో పేరు ఫోకస్ అవుతోంది. కొన్నొ రోజుల క్రితం వరకు కొణతాల రామకృష్ణ పేరు వినిపిస్తే.. ప్రస్తుతం మెగా బ్రదర్ కొణిదల నాగబాబు ఫోకస్ అవుతోంది. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై పట్టుకోసం జనసేనాని.. తన అన్న నాగబాబుని అనకాపల్లి బరిలోకి దింపుతారంటున్నారు. మరి నాగబాబు వస్తే కొణతాల పరిస్థితి ఏంటి?
రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర కూడా కీలకం కానుంది. 2019 ఎన్నికల్లో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేశారు. ఓటమి పాలైనా ఉత్తరంధ్రను వదలలేదు. ఎప్పటికప్పుడు ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే సీటుపైనే అందరి కళ్ళు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఉత్తరాంధ్రకు తన అన్న కొణిదెల నాగబాబుని ప్రాతినిధ్యం వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Read More : ప్లేస్, టైమ్ చెప్పు.. జగన్కు చంద్రబాబు ఛాలెంజ్..
ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం ఎంతో కీలకమైంది. గవర సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండటంతో.. ఆ వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడ నుండి పోటీ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీలో ఉంటారనే ప్రచారం గత ఆరు నెలలుగా జరుగుతూ వచ్చింది. రెండు నెలల క్రితం కొణతాల జనసేనలో జాయిన్ అవ్వడంతో.. అనకాపల్లి ఎంపీ కేండెట్ అయనేనని అందరూ భావించారు. ఆ క్రమంలో కొణతాల కూడా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్లి పని మొదలు పెట్టేశారు.
అయితే సడన్గా జనసేనానిపవన్కళ్యాణ్ అన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అనకాపల్లి స్క్రీన్పై ఫోకస్ అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి తగ్గట్లే మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో ప్రత్యక్షం అయిపోయారు. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు అనకాపల్లిలో పర్యటించారు . ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో మీటింగ్స్ పెట్టి.. అందరికి దగ్గర అయ్యేలా పావులు కదుపుతున్నారు.
Read More : గంజాయి క్యాపిటల్గా విశాఖను మార్చేశారు.. వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్..
అయితే నాగబాబు అనకాపల్లి టూర్లో జనసేన నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కనిపించకపోతుండటం చర్చనీయాంశంగా మారింది. నాగబాబు మొదటి సారి వచ్చినప్పుడు కొణతాల వెళ్లి కలవలేదు. అయిదు రోజుల పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటించినప్పటికీ ఆ మాజీ మంత్రి ముఖం చాటేశారు. మూడు రోజుల వ్యవధిలో నాగబాబు మళ్లీ అనకాపల్లి వచ్చినా.. కొణతాల ఇంటి నుండి బయటకు రాలేదు.
దాంతో నాగబాబు స్వయంగా కొణతాల ఇంటికి వెళ్లారు. వారిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయంటున్నారు. కొణతాలను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొణతాలను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరారంటే.. ఎంపీ అభ్యర్థిగా నాగబాబు కన్ఫామ్ అయినట్లేనని.. జనసేన కేడర్ సంబరాలు చేసుకుంటోంది. నాగబాబుని అనకాపల్లి బరిలో దింపడం వెనుక పెద్ద ప్లాను ఉందంటున్నారు.
Read More : టీ గ్లాస్ సింకులో.. సైకిల్ బయట.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి..
పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో ఎవరికీ అంతుపట్టడం లేదు. పిఠాపురం, కాకినాడ, భీమవరం లాంటి నియోజకవర్గాలు ప్రచారంలో ఉన్నా ఆయన మనసులో ఏముందో జనసైనికులకు అర్థం కావడం లేదు. నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తే.. పవన్ కూడాఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయినా.. విశాఖలో ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయకపోతే.. జనసైనికులు ఢీలా పడటం ఖాయం. అందుకే తన అన్న నాగబాబుని అనకాపల్లి నుంచి పోటీకి దింపి.. ఆ లోటు లేకుండా చేయాలన్నది పవన్ ఆలోచనగా చెప్తున్నారు.
నాగబాబుని అనకాపల్లి ఎంపీ బరిలో నిలపాలన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే పవన్ విశాఖ టూర్ ఖరారవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన అన్నకి మద్దతు కూడగట్టడానికి ఆయన వైజాగ్ లో రెండు రోజులు మాకాం వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబుని ఒకే చేస్తే.. కొణతాలను ఎలా బుజ్జగిస్తారు? ఆయన వర్గాన్ని ఎలా శాంతింప చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాగబాబు పర్యటనలకు దూరంగా ఉన్న కొణతాల పవన్ రాకతో అయినా చల్లబడతారో? లేకపోతే పవన్ పర్యటనను కూడా ముఖం చాటేసి ఇంట్లోనే కూర్చుంటారో? చూడాలి.