Nagababu: ఏపీలో అందరి టార్గెట్ పవన్ కల్యాణే. వైసీపీ నేతలకు రోజూ పవన్ ను తిట్టడమే పని. సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ.. అంతా జనసేనానిపై నోరు పారేసుకుంటారు. వారికి తోడుగా కొత్తగా రామ్ గోపాల్ వర్మ సైతం జతకలిశారు. వైసీపీ మీద సినిమా తీస్తున్నందుకో.. పవన్ మీద పాత పగలో.. కారణం ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడల్లా మెగా ఫ్యామిలీని గిల్లుతుంటాడు ఆర్జీవి. దీంతో.. చిర్రెత్తుకొచ్చిన మెగా బ్రదర్ నాగబాబు వర్మకు, వైసీపీకి ఇద్దరికీ కలిసి ఇచ్చిపడేశారు.
ఇటీవల పవన్ కల్యాణ్.. చంద్రబాబును ఇంటికెళ్లి కలిశారు. కుప్పంలో బాబును అడ్డుకున్న ఉదంతంపై, జీవో నెంబర్ 1పై ఆ ఇద్దరూ కలిసి చర్చించారు. వారి భేటీపై వైసీపీ నేతలు వరుసబెట్టి మాటల దాడి చేస్తున్నారు. ప్యాకేజీ కోసమే పవన్.. చంద్రబాబును కలిశారంటూ ఎప్పటిలానే ఆరోపణలు చేశారు.
ఇక, ఆర్జీవీ అయితే తనదైన స్టైల్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ప్యాకేజ్ కోసం కాపులను తాకట్టు పెట్టావంటూ.. పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై కాపు సంఘాలు ఇప్పటికే మండిపడ్డాయి. ఇప్పుడిక పవన్ సోదరుడు నాగబాబు అటు వైసీపీపై, ఇటు వర్మపై ఫైర్ అయ్యారు.
పవన్ కు ప్యాకేజీ ఎవరు ఇచ్చారు? వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కు ప్యాకేజీ ఇచ్చారా? అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకునే పవన్ కు ప్యాకేజీ అవసరమా? అని ప్రశ్నించారు. అటు.. రామ్ గోపాల్ వర్మ పెద్ద వెధవ అంటూ నాగబాబు మండిపడ్డారు. అవసరం కోసం వర్మ ఎంత నీచానికైనా దిగజారుతాడని చీదరించుకున్నారు. నాగబాబు కామెంట్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.