Nadendla Manohar : ఏపీ సీఎం జగన్ తెనాలిలో రైతు భరోసా నిధులు విడుదల చేసే కార్యక్రమానికి వెళ్లిన విధానంపై జనసేన విమర్శలు గుప్పిస్తోంది. సీఎం నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి కేవలం 28 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మాత్రం దూరం కూడా సీఎం జగన్ కారులో ప్రయాణించలేరా అని ప్రశ్నించారు. హెలీకాప్టర్ లో వెళ్లడమేంటని నిలదీశారు.
రోడ్లు గుంతలు పడి పాడైపోవడం వల్లే సీఎం జగన్ హెలీకాప్టర్ లో వెళ్లారా అని మనోహర్ ప్రశ్నించారు. కేవలం 28 కిలోమీటర్ల దూరానికి కూడా సీఎం హెలీకాప్టర్ లో వెళ్లడంపై జనం నవ్వుకుంటున్నారని సెటర్లు వేశారు. ప్రజాధనం సీఎం హెలీకాప్టర్ ప్రయాణాలతో వృథా అవుతోందని మండిపడ్డారు. ఆ డబ్బుతో రాష్ట్రంలో రోడ్లు మరమ్మత్తులు చేయవచ్చని అన్నారు. ప్రజలను గతుకుల రోడ్ల పాల్జేసి తాను మాత్రం దర్జాగా హెలీకాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారని సీఎం జగన్ పై నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
మరోవైపు సీఎం జగన్ తెనాలి పర్యటన సమయంలో జనసేన కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేయడాన్ని మనోహర్ ఖండించారు. అధికార పార్టీ నాయకులకు ఎందుకంత అభద్రతా భావమని ప్రశ్నించారు. ఇలాంటి అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. సీఎం వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని నిలదీశారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా సీఎంకు భయమని విమర్శించారు. సీఎం పర్యటనల వేళ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తున్నారని మనోహర్ మండిపడ్డారు.