Mudragada Padmanabham : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ తాలూకా ముద్ర మళ్లీ కనబడుతోంది. అన్ని పార్టీలు ఆయన రాక కోసం ఆహ్వానాలు పంపుతున్నాయి. తమ పార్టీలోకి వస్తున్నారంటూ లీకలు కూడా ఇస్తున్నాయి. ముద్రగడ కూడా అన్ని పార్టీలతోనూ అలాగే ఉంటున్నారు. తాజాగా జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందడంతో ఈ అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇంత జరుగుతున్నా ముద్రగడ పద్మనాభం ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు. అది ఆయన తరహా రాజకీయం.
ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరంలేని పేరు .. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అవసరం అన్ని రాజకీయ పార్టీలకి ఉంది. రాజకీయ పార్టీల అవసరం ఆయనకీ ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, ఒక్కసారి ఎంపీగా గెలిచి గల్లి నుంచి ఢిల్లీ వరకు తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారాయన. 1978లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా మంత్రిగా , తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీగా పని చేశారు. 2009లో రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు పిఠాపురం నియోజకవర్గ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిని చూశారు. అనంతరం 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గ నుంచి బరిలోకి దిగి ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
అప్పటినుండి సుమారు పది సంవత్సరాలపాటు ప్రత్యక్ష రాజకీయాల దూరంగా ఉంటూ కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం రాజకీయాలు దూరం కాలేదు. ఎన్నికల సమీపిస్తున్న తరంలో ప్రతిసారి అన్ని పార్టీలు ముద్రగడను తమతో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే పదేళ్లుగా ఆయన ఏ పార్టీ వైపు చూడలేదు.
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో.. మా పార్టీలోకి రండి .. మా పార్టీ జెండాతో మీకు నచ్చిన నియోజకవర్గం నుంచి పోటీ చేయండని.. దాదాపు అన్ని పార్టీలు ముద్రగడతో రాయబారాలు మొదలుపెట్టాయి. అప్పటి ప్రజారాజ్యం పార్టీ నుండి ఇప్పటి జనసేన పార్టీ వరకు అందరు ఆయన్ని తమవైపు తిప్పుకోవాలని చూసిన వారే. ముద్రగడ పద్మనాభం ప్రజారాజ్యంలోకి వెళ్తారని 2009 ఎన్నికల టైంలో ఊహాగానాలు చెలరేగినా.. చివరికి ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక ఆయన ఏ పార్టీలోనూ చేరే ప్రయత్నం చేయలేదు.
2016 ఫిబ్రవరిలో జరిగిన కాపు గర్జన ముద్రగడ పద్మనాభానికి సామాజిక వర్గంలో ఎంత పేరు తెచ్చిందో.. రాజకీయంగా అంతే డ్యామేజ్ చేసిందన్న అభిప్రాయం ఉంది. ముద్రగడ పద్మనాభాన్ని ఏ పార్టీ అయినా సొంతం చేసుకుంటే.. ఆ పార్టీపై కులముద్ర పడిపోతుందనే అపవాద లేకపోలేదు. మళ్లీ ఎలక్షన్ సీజన్ మొదలవ్వడంతోగత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం పై పెద్ద చర్చే జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ, పిఠాపురం పర్యటన సందర్బంగా చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కొన్ని లేఖలు సంధించారు. దాంతో మొదలైంది అసలు రాజకీయ రచ్చ.. ముద్రగడ పద్మనాభం వైసిపి సానుభూతిపరుడన్న ముద్ర పడే పరిస్థితి తలెత్తింది.
ఆ క్రమంలో కొంతకాలంగా ముద్రగడ వైసీపీలో చేరతారు. ఆయన కొడుకుగిరి ప్రత్తిపాడు నుంచి గాని పిఠాపురం నుంచి గాని బరిలో ఉంటారన్న ప్రచారం జరిగింది. కొడుక్కి వైసీపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చి ముద్రగడను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తారు అన్న ఊహాగానాలు కూడా చెలరేగాయి. అయితే ప్రతిపాడు, పిఠాపురం సీట్లకు వైసీసీ అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇక ఆ పార్టీలో చేరే అవకాశం లేదని తేలిపోయింది.
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కాపులు పెద్దలు తనను ఎంత విమర్శించినా వాటిని దీవెనలు గానే భావిస్తానని.. కాపు పెద్దల కోసం జనసేన వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని బహిరంగంగా లేఖ రాశారు. దాంతో ముద్రగడ పద్మనాభం తన వియ్యంకుడు తాడేపల్లిగూడెం జనసేన ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీను ద్వారా పవన్ కళ్యాణ్కి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని కాకినాడ సభలో ఆయన మాట్లాడిన మాటలపై మాత్రమే తాను స్పందించానని పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలు చేస్తే తామందరం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్లు తెలిసింది ..
ఇక తాజాగా బోలిశెట్టి శ్రీను, కాపు ఉద్యమంలో పాల్గొన్న కల్వకొలను తాతాజీలు ముద్రగడతో భేటీ అయి సుమారు గంటసేపు మంతనాలు జరిపారు. వారి ద్వారా ముద్రగడ పద్మనాభం ఒక సీల్డ్ కవర్లో పవన్ కళ్యాణ్కి మరో లేఖ పంపారంట. అదలా ఉంటే ఆ మరుసటి రోజే జగ్గంపేట టిడిపి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వచ్చి ముద్రగడను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జ్యోతుల నెహ్రూ మాత్రం తన సొంత పని మీదే కలిసానని .. టిడిపి పెద్దలు ఎవరు తనను కలవమని చెప్పలేదని తేల్చి చెప్పేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి రాసిన లేఖలో ఏముంది అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. మరి ఈ సారైనా ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? లేదా అనేది చూడాలి.
.
.