Mudragada Padmanabham: ముద్రగడ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముద్రగడ కోసం అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ముద్రగడ చూపు మాత్రం జనసేన వైపు ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ముద్రగడతో జనసేన నేతలు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ముద్రగడతో జగ్గంపేట టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ భేటీ అయ్యారు. తనను కలవడానికి రావొద్దని వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు ముద్రగడ చెప్పడం హాట్ టాపిక్గా మారింది. సజ్జలకు సైతం ఫోన్లోనే క్లారిటీ ఇచ్చారు ముద్రగడ. త్వరలో పవన్ కల్యాణ్ తో ముద్రగడ భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ముద్రగడ జనసేన తరపున పిఠాపురం బరిలో దిగుతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముద్రగడ కోసం తన సీటు త్యాగం చేసేందుకు ఓరుపుల తమ్మయ్య బాబు సిద్ధమయ్యారు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇన్నాళ్లూ వైసీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. తాజా పరిణామాలను పరిశీలిస్తే వైసీపీతో మైత్రి ఉండదని, ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు నేత కల్వకొలను తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు. గురువారం ఉదయం టీడీపీ జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరికొందరు టీడీపీ నాయకులు కలిసి ముద్రగడ ఇంటికి వెళ్లి దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. ఈ భేటీలు రాజకీయపరమైనవేనన్న చర్చ జరిగింది. జగ్గంపేట మండలం ఇరిపాకలో కోటి శివలింగార్చనకు ముద్రగడను ఆహ్వానించడానికే వెళ్లానని, హైకమాండ్ తనను పంపలేదని జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని సహకారం ఇవ్వాలని కోరితే అందుకు ముద్రగడ హామీ ఇచ్చారని నెహ్రూ వెల్లడించారు.
కొందరు కాపులను వైసీపీ కావాలనే రెచ్చగొడుతోందని, వారి ఉచ్చులో పడొద్దని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇటీవల బహిరంగ లేఖ రాశారు. కాపు పెద్దలు తిట్టినా దీవెనలుగానే తీసుకుంటానని, నాయకులు ఎవరొచ్చినా గుమ్మాలు తెరిచే ఉంటాయని అందులో పేర్కొన్నారు. దీనిపై ముద్రగడ తన అనుచరుల వద్ద సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముద్రగడకు ఆప్తులుగా ఉండే జనసేన, కాపు నాయకులు ఆయనను జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేశారు. ముద్రగడ నివాసానికి వెళ్లి చర్చించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి పవన్కల్యాణ్కు ఇవ్వాలని ఓ లేఖ రాసి జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్కు ఇచ్చినట్లు సమాచారం. ఈ లేఖను పవన్కల్యాణ్కు అందజేసిన తరవాత భవిష్యత్తు పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో పవన్, ముద్రగడలు భేటీ అయ్యే అవకాశం ఉంది.
జనసేన, టీడీపీ, కాపు నేతలు ముద్రగడతో వరుసగా సమావేశం కావడంతో వైసీపీ అప్రమత్తమైంది. నేరుగా ఓ ఎమ్మెల్సీ ముద్రగడకు ఫోన్చేసి మీ ఇంటికి వస్తానని చెప్పగా.. రావొద్దని, మీ పని మీరు చూసుకోండని, మీ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు ముద్రగడ. ఈ తాజా పరిణామాలపై ముద్రగడ, ఆయన కుమారుడు అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు.
2014 నుంచి 2019 మధ్య కాపులకు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ నడిపించారు. ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన తుని సభ తర్వాతే..రైలుకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ మధ్య కాలం దాకా.. వైసీపీకి అనుకూలంగా ముద్రగడ మాట్లాడారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక సార్లు ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. టీడీపీకి మద్దతు ఇవ్వడంపై పవన్ కల్యాణ్ పైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీ ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాపులు ఏవైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కాపులని తమవైపుకి తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముద్రగడ చేరితే కాపు ఓటు బ్యాంక్ తమవైపే ఉంటుందన్న ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. అందుకే ముద్రగడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముద్రగడ ప్రస్తుత వయసు 75 సంవత్సరాలు. ఈ సారి ఎన్నికలను ముద్రగడ ప్రభావితం చేయగలరా..? గెలుపు ఓటములను శాసించగలరా..? అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
.
.