Mudragada Padmanabham : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆయనతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ ప్రతిపాదనను ముద్రగడకు విథున్ రెడ్డి వివరించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముద్రగడకు కాకినాడ ఎంపీ స్థానం లేదంటే ప్రత్తిపాడు, పెద్దాపురం అసెంబ్లీ సీటు జగన్ ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ ఆప్షన్ను కూడా ముద్రగడకే ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు ముద్రగడ ఫ్యామిలీ నుంచి ఒకరికి కోరుకున్న చోట పోటీకి అవకాశం ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్టు వినికిడి.
ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి ఉద్యమాలు చేయలేదు. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని కూడా చెప్పారు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముద్రగడను మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ముద్రగడకు దాదాపు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 1978లో జనతాపార్టీ నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 85 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ వీడి కాంగ్రెస్లో చేరారు. 1989 ఎన్నికల్లో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
1994 ఎన్నికల్లో ముద్రగడ తొలిసారిగా ఓటమి చవిచూశారు. ఆ తర్వాత నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఆయన గెలవలేదు. 1999లో మాత్రం కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. 2004 నుంచి ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లో గెలవలేదు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించలేదు. ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి దాదాపు 29 ఏళ్లు అయ్యింది.