Chain Snatcher : అతడు బాడీ బిల్డర్. ఎంతో కష్టపడి మిస్టర్ ఆంధ్రగా ఎంపికయ్యాడు. డిగ్రీ కూడా చదువుకున్నాడు. కొన్నాళ్లు కువైట్ లో డ్రైవర్ గా పని చేశాడు. కరోనాకు ముందు స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత కడపలో హోటల్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే అతను దొంగగా మారాడు.
తాజాగా బెంగళూరులోని గిరినగర్ పోలీసులు రెండు చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన సయ్యద్ బాషా, షేక్ ఆయూబ్ గా గుర్తించారు. వీరికి 36 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు బస్సులో బెంగళూరుకు వచ్చి హోటల్ లో బస చేస్తున్నారు. తొలుత బైక్ ను దొంగిలిస్తున్నారు. ఆ వాహనంపై తిరుగుతూ వృద్ధ మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళుతున్నారు. వెళ్లేటప్పుడు ఆ బైక్ లను వదిలేసి.. స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అక్కడే బంగారాన్ని అమ్మేస్తున్నారు.
మార్చి 22న రాత్రి 8 గంటల సమయంలో జానకి అనే మహిళ గిరినగర్లోని తన సోదరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోని 56 గ్రాముల గోల్డ్ చైన్ ను నిందితులు లాక్కెళ్లారు. సుబ్రమణ్యపురలో ఓ మహిళ నుంచి గొలుసును అపహరించారు. అదే నెలలో మరో మహిళ మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. సుబ్రమణ్యపురలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
ఇటీవల బైటరాయణపురలోని టింబర్ యార్డ్ లేఅవుట్లో పార్క్ చేసిన ఓ బైక్ను గిరినగర్ పోలీసులు గుర్తించారు. దీంతో 20 రోజుల క్రితం ఆ బైక్కు జీపీఎస్ ను అమర్చారు. మళ్లీ ఏప్రిల్ 18న బెంగళూరు వచ్చిన నిందితులు అదే బైక్ తీసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 10 గ్రాముల బంగారం, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు.