YSRCP: నెల్లూరు పెద్దారెడ్ల వింత రాజకీయం జిల్లాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ అధిష్టానం వేటు వేసిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డికి.. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సాయం చేశారు. పార్టీ అధినేత జగన్ నియమించిన వెంకటగిరి ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి షాక్ ఇచ్చారు. మధ్యలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటరవడం కూడా హాట్ హాట్గా మారింది. ఇందుకు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలాధ్యక్షుడి ఎన్నిక వేదికైంది.
నెల్లూరు జిల్లా రాపూరు ఎంపిపి చెన్నుబాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో కొత్త మండలాధ్యక్షుడి కోసం ఎన్నిక జరిగింది. రాపూరు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీలు ఉండగా.. గురువారం ఏ ఒక్కరు ఓటింగ్కు రాలేదు. దీంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.
12 మంది ఎంపీటీసీల్లో ఆనం వర్గానికి చెందినవారు ఆరుగురు ఉండగా.. మిగతా ఆరుగురు నేదురుమల్లి వర్గీయులుగా ముద్ర పడ్డారు. ఆనంకు ఆత్మీయుడైన చెన్ను బాలకృష్ణారెడ్డి వర్గంలో తొలుత ఐదుగురు మాత్రమే ఉండగా.. నేదురుమల్లి గ్రూపు సభ్యులు ఏడుగురు అయ్యారు. అయితే తనకు ఎంపీపీ పదవి ఇవ్వాలంటూ నేదురుమల్లి వర్గీయుడు పాపకన్ను మధురెడ్డి పట్టుపట్టడంతో రాజకీయం మలుపు తిరిగింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇదే అదనుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన మంత్రి కాకాణి సాయంతో రాజకీయం నడిపించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో మాట్లాడి ఎట్టకేలకు తమకు సన్నిహితుడు చెన్ను బాలకృష్ణారెడ్డి వర్గానికి అనుకూలంగా వ్యూహం రచించారు. మొత్తానికి.. చెన్ను వర్గానికే చెందిన ప్రసన్న ఎంపీపీగా ఎన్నికయ్యారు.