ఆస్తుల్లో వాటాలు ఉంటే ఈడీ విచారణ ఏదీ?
షర్మిలపై కేసులు, జైలుకు ఎందుకు వెళ్లలేదు?
తల్లి, చెల్లిపై కేసులు వేసే ఉద్దేశం జగన్కు లేదు
సాక్షి, భారతీ కంపెనీలు వైఎస్ జగనే స్థాపించారు
టీడీపీ కుట్రలో పావుగా ఉన్నారని వైవీ వ్యాఖ్యలు
వ్యక్తిగత లేఖ బయటికి ఎలా వచ్చిందని పేర్ని ప్రశ్న
అమరావతి, స్వేచ్ఛ:
YCP Leaders Fires On Chandrababu: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన తల్లి, చెల్లిపై కేసులు వేయాలనే ఉద్దేశం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని, టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ షర్మిలకు లీగల్గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఈడీ కేసులు ఎదుర్కొనేవారు కదా? కేసుల్లో షర్మిల ఎందుకు జైలుకు వెళ్లలేదు? అని ప్రశ్నించారు. ‘సాక్షి, భారతీ సిమెంట్ రెండూ జగన్ స్థాపించిన సంస్థలే. ఇవి వైఎస్ ఉండగా స్థాపించిన సంస్థలు. ఆయా సంస్థల్లో షర్మిల, అనిల్ కానీ డైరెక్టర్లుగా లేరు. భారతీ సిమెంట్ ఆయన భార్య పేరుతో ఏర్పాటు చేశారు. జగతి అని కూడా జగన్, భారతీ పేర్లు వచ్చేలా పెట్టారు. ఇందులో వాటాలు ఉంటే జగన్ అప్పుడే రాసిచ్చేవారు. ఈ విషయంలో షర్మిల అబద్ధాలు ఆడుతున్నారు. సరస్వతి సిమెంట్స్ ప్రాపర్టీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. అయినా సరే షేర్ల బదలాయించుకోవడంలో కుట్ర ఉంది. 2019 ఆగస్టులో జగన్, షర్మిల ఎంవోయూ రాసుకున్నారు. ప్రాపర్టీ చూసుకున్నాకే షర్మిల సంతకాలు చేశారు. జగన్ ప్రేమ, అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. షర్మిల చేస్తున్న రాద్ధాంతం అంతా ఆస్తుల కోసమే అని అర్థమవుతోంది’ అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
శత్రువులతో షర్మిల..
వైఎస్ షర్మిల శత్రువులతో చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తండ్రి ఆశయం కోసమే అయితే చంద్రబాబు కోసం ఎందుకు పని చేస్తారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ను అభిమానించే వారు ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారన్నారు. షర్మిల తాపత్రయం అంతా ఆస్తుల కోసమే తప్ప తండ్రి ఆశయాల కోసం కానే కాదన్నారు. వ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం టీడీపీ అధికార వెబ్సైట్లోకి ఎందుకొచ్చింది? అని పేర్ని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ రాజకీయాలకు ఇదంతా నిదర్శనమని హితవు పలికారు. షర్మిలతో పాదయాత్ర వద్దని, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని తానే స్వయంగా జగన్తో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కంపెనీల్లో షర్మిలకు వాటాలు ఉంటే ఆమెను కంపెనీల్లో డైరెక్టర్లుగా నాడు వైఎస్సే పెట్టేవారు కదా? అని నాని మండిపడ్డారు. చంద్రబాబు అనవసరంగా జగన్ ఫ్యామిలీ గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ను ఎన్నికల కోసం వాడుకుని ఎందుకు వదిలేశారని చంద్రబాబును ప్రశ్నించారు. అసలు చంద్రబాబు తన తోడబుట్టిన వారికి రాసిచ్చిన ఆస్తులు ఎన్ని? ఏమేం రాసిచ్చారు? అని బాబుకు పేర్ని నాని సూటి ప్రశ్న సంధించారు.