Raghu Rama Krishna Raju : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత తన పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్లారు. భీమవరంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆయన మెడలో భారీ గజమాల వేసి అభిమానులు హంగామా చేశారు. ర్యాలీగా ఆయన భీమవరం చేరుకున్నారు.
రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన రఘురామకృష్ణరాజు భీమవరం చేరుకున్న ఆయనకు అభిమానులు, టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు.
ఇన్నాళ్లూ తనను ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి రాకుండా చేశారని మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు. టీడీపీ, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైసీపీ పని అయిపోయిందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉందన్నారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ పొత్తు విషయం తేలుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నానని తెలిపారు. టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు.