Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజూమునే పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు వెళ్లారు. అప్పటికే నివాసంలోనే భాస్కర్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పీఏలను సీబీఐ అధికారులు ఇంటి బయటే ఉంచారు.
ఇంట్లోకి వెళ్లిన సీబీఐ బృందం భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించింది. ఆయన ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకుంది. ఆదివారం సాయంత్రంలోపు సీబీఐ న్యాయమూర్తి ఎదుట అధికారులు హాజరుపరచనున్నారు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 130 బి, రెడ్ విత్ 302, 201 కింద సీబీఐ కేసు నమోదు చేసింది. భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మికి అరెస్ట్ సమాచారాన్ని సీబీఐ అధికారులు ఇచ్చారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే 4 సార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. అలాగే అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆదివారం పులివెందులలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపే ఆయన తండ్రిని సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
సీబీఐ అధికారులు వచ్చిన విషయాన్ని తెలుసుకుని అవినాష్రెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో భాస్కర్రెడ్డి నివాసం వద్దకు తరలివచ్చారు. ఆయనను పులివెందుల నుంచి తరలిస్తున్న క్రమంలో సీబీఐ అధికారుల వాహనాలను అడ్డుకునేందుకు యత్నించారు.
వివేకా హత్య కేసులో రెండు రోజుల క్రితం ఎంపీ అవినాష్రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్యకు ముందు భాస్కర్రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీబీఐ అధికారులు భాస్కర్రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.