Movie Shooting in Tirupati : తిరుపతి.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రోజూ భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఇలా రద్దీ ఉండే తిరుపతిలో సినిమా షూటింగ్ కు అనుమతి ఇవ్వడం వివాదంగా మారింది.
గరుడ సర్కిల్లో తమిళ, తెలుగు చిత్ర షూటింగ్ జరిగింది. ఉదయం 7 నుంచి 10 గంటల సమయంలో.. గరుడ విగ్రహం ఎదురుగా యాక్సిడెంట్ సీన్ చిత్రీకరించారు. దీంతో ట్రాఫిక్ నిలిపివేశారు. గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. మరోవైపు ఇటు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమయానికి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోయారు. గరుడ విగ్రహం ఎదుట సీన్ చిత్రీకరణపై స్థానికులు మండిపడ్డారు. పవిత్రమైన గరుడ సర్కిల్ లో ఎలా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా మంగళ, బుధవారాలకు గానూ చిత్ర యూనిట్ తిరుపతిలో మూడు చోట్ల పర్మిషన్ తీసుకుంది. తిరుపతి గరుడ విగ్రహం రోడ్డు, నంది సర్కిల్, గోవిందరాజస్వామి గుడి ప్రదేశాలలో సినిమా చిత్రీకరించేందుకు అసిస్టెంట్ ఫిల్మ్ మేనేజర్ గణేశ్ తిరుపతి అడిషనల్ ఎస్పీ వద్ద ఈ నెల 27వ తేదీన పర్మిషన్ తీసుకున్నారు. శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ధనుష్, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.