Ysrcp MVV Satyanarayana: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కష్టాలు తప్పవా? హయగ్రీవ భూముల అమ్మకాల్లో కోట్ల రూపాయలు చేతులు దాటాయా? దీని వెనుక సూత్రధారి ఎవరు? మాజీ ఎంపీ పనైపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
గడిచిన ఐదేళ్లు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు స్వర్ణయుగం. ఆయన చెప్పిందే వేదం.. ఖాళీ భూములు కనిపిస్తే చాలు.. ఆయన సొంతం కావాల్సిందే. ఎంవీవీ బలమైన కోరికే ఈడీ ఉచ్చు బిగిసుకుంది. దాదాపు 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్కు పాల్పడినట్టు గుర్తించారు అధికారులు. దీంతో ఆయన పనైపోయినట్టేనా అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
వృద్ధులకు కాటేజీల నిర్మాణం కోసం హయగ్రీవ భూములను మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్వాహా చేసినట్టు తేల్చేసింది ఈడీ. ఆ ప్రాజెక్టు భూములను స్వాధీనం చేసుకుని తప్పుడు పత్రాలతో బినామీ పేరిట లావాదేవీలు జరిపినట్టు అధికారులు చెబుతున్నమాట. ఇంతకీ ఆ భూములెక్కడ?
ఎండాడలోని హయగ్రీవ ప్రాజెక్టుకి చెందిన పన్నెండున్నర ఎకరాల భూములను తమ నుంచి బలవంతంగా తీసుకున్నారంటూ ఈ ఏడాది జూన్లో ఆరిలోవ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు చిలుకూరి జగదీశ్వరుడు, ఆయన భార్య.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
హయగ్రీవ భూములకు సంబంధించి ఈడీ కార్యాలయం కీలక విషయాలు బయటపెట్టింది. 2008లో ఎండాడలోని హయగ్రీవ ఫామ్స్ డెవలపర్స్ సంస్థకు ప్రభుత్వం భూములను కేటాయించింది. వృద్ధులు, అనాధల కాటేజీల నిర్మాణం చేయాలన్నది అసలు అజెండా.
14 ఏళ్ల కిందట అంటే 2010లో ఐదున్నర కోట్లు రూపాయలు చెల్లించింది ఆ సంస్థ. అయితే రిజిస్ట్రేషన్ నాటికి ఆ భూముల విలువ 30 కోట్లకు పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో ఆయా భూముల విలువ అక్షరాలా 200 కోట్ల పైమాటే.
ఈ భూములపై ఐదేళ్ల కిందట అప్పటి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కన్నుపడింది. ఎంవీవీ, ఆడిటర్ జీవీలు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. మూడేళ్ల కిందట ఆ భూములను ప్లాటులుగా విభజించి ఆపై అమ్మేశారు. ఏకంగా 150 నుంచి 200 కోట్ల రూపాయలు భూ లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది.
ఎంవీవీ, జీవీతోపాటు వారి ఫ్యామిలీ సభ్యుల పేరుతో ఉన్న 300కి పైగా సేల్ డీడ్లకు సంబంధించి 50 కోట్లు లావాదేవీలు జరిగినట్టు నిర్థారించే పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈడీ సోదాల్లో చాలా వరకు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.