Modi : ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందానన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇస్తామన్నారు.
మరోవైపు చంద్రబాబాబు సభలో తొక్కిసలాట ఘటనపై కేసు నమోదైంది. సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చుతారు. అటు మృతదేహాలకు కందుకూరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 8 మంది మృతదేహాలను అంబులెన్స్ ల్లో వారి స్వస్థలాలకు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే పేరుతో యాత్ర చేపట్టారు. బుధవారం కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బాబుకు ప్రచార యావ చాలా ఎక్కువని విమర్శిస్తున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంతో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోరని మండిపడుతున్నారు. ఇరుకురోడ్డులో బహిరంగ సభ నిర్వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.
పోలీసుల తీరును టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వేతర కార్యక్రమాలకు వచ్చినా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు.. చంద్రబాబు పర్యటనను పట్టించుకోలేదని అంటున్నారు. ఈ నెల 20న ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ విందుకు సీఎం జగన్ వచ్చినప్పుడు 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ నెల 26న మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందగా.. ఆ తర్వాత రోజు సీఎం జగన్ మంత్రిని పరామర్శించడానికి వచ్చినప్పుడు వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించారని.. చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలీసులు ఆ స్థాయిలో కనిపించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.