ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని.. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వాదాలు ఇచ్చారు. రంగనాయకుల మండపంలో మోదీకి వేదాశీర్వచనం చేశారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, 2024 క్యాలెండర్, డైరీలను టీటీడీ అధికారులు మోదీకి అందజేశారు. కాగా.. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల గిరులపై భద్రతను కట్టుదిట్టం చేశారు. 2 వేలమంది పోలీసులతో బందోబస్త్ నిర్వహించారు. మోదీ స్టే చేసిన అతిథి గృహాలను ఎన్ఎస్ జీ టీమ్స్ ఆధీనంలోకి తీసుకున్నాయి.
తిరుమల పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు మహబూబాబాద్, కరీంనగర్ లో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొని, సాయంత్రం హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొననున్నారు.
.
.
.