ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ప్రజాక్షేత్ర పోరుతో ఆసక్తికర పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు జగన్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కదని తెలిసిన నేతలంతా వైసీసీ బలగాన్ని వీడి బయటకు వచ్చేశారు. తాజాగా విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ కూడా పార్టీకి గుడ్బై చెప్పి జనసేనలో చేరుతారన్న జోరు ప్రచారంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.
వైనాట్ 175 అంటున్న వైసీసీ అధినేత సీఎం జగన్.. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టడంతో కొందరు పార్టీని వీడారు. మరికొందరు తమ టికెట్కి ఎక్కడ ఎసరు పడుతుందోనన్న ఆందోళనతో పక్క చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా పార్టీని వీడి జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటన సమయంలో ఆయనతో వంశీ భేటీ కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. చర్చల తర్వాత జనసేనలో చేరే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ తన వర్గంతో మంతనాలు జరపుతున్నట్టు తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ జనసేన అభ్యర్థిగా దిగాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
వంశీకృష్ణ పార్టీ వీడుతారన్న ప్రచారంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. బుజ్జగించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు శివాజీపాలెంలోని వంశీకృష్ణ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు మంతనాలు జరిపారు. పార్టీ మారే ఆలోచన లేదని వంశీకృష్ణ తనకు చెప్పారన్నారు.
వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 2009లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి పార్టీ కీలక పదవులు నిర్వహించారు. ఇప్పుడు టిక్కెట్ దక్కదనే తేలడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.