MLC Pothula Sunitha Resign : ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎంపీ మోపిదేవి ఆ పార్టీకి రేపో మాపో రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ పోతుల సునీత అధిష్టానానికి భారీ షాకిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె పార్టీ హై కమాండ్ కు లేఖ పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.
ఇక గురువారం వైసీపీకి మరికొంతమంది ఎంపీలు, వారి అనుచరులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ.. ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. వైసీపీ వ్యూహాలేవీ ఫలించడం లేదని తెలుస్తోంది.
పైగా కూటమి ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో ఇప్పుడే పార్టీ మారితే మంచిదన్న ఆలోచనతో ఆ పార్టీనేతలు రాజీనామాలు చేస్తున్నారన్న విషయం బహిరంగంగానే వినిపిస్తోంది. వీరంతా అతిత్వరలోనే రాజ్యసభ ఛైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలాగే వైసీపీకి రాజీనామాలు కొనసాగితే.. త్వరలోనే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవచ్చన్న వాదన కూడా ఉంది.