MLC Botsa Satyanarayana Mark Politics: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అభ్యర్థిని పోటీకి దింపలేదు. ఆ పుణ్యమా అని బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐతే.. ఇప్పుడు బొత్సకు మరో జాక్పాట్ తగిలింది. మండలిలో బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రకటిస్తే.. ఆయనకు కేబినెట్ హోదా వస్తుంది. దానికి తగ్గట్లే మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పిరెడ్డి ఇప్పుడు ఆ పదవికి రిజైన్ చేశారు .. అంటే బొత్సకు ప్రతిపక్ష నేత హోదా ఇక లాంఛనమే .. అయితే శాసనసభలో జగన్ సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోనున్నారు. జగన్కు దక్కని కేబినెట్ హోదా.. బొత్సకు దక్కితే.. మరి వైసీపీ అధినేత తట్టుకోగలరా..? బొత్స అప్పుడే తనదైన మార్క్ రాజకీయం మొదలుపెట్టేశారా?
విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ.. కాంగ్రెస్తో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అలంకరించారు. ఒకానొక దశలో ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు. అయితే అనూహ్యంగా ఆ పదవి రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. ఎక్కడో విజయనగరంలో కోపరేటివ్ సొసైటీ చైర్మన్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సీఎం మినహా అన్ని పదవులు అనుభవించారు.
1999లో బొబ్బిలి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, కొనిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొత్స వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి చీపురుపల్లి నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నారు. దాంతో జగన్ ప్రత్యేకంగా బొత్సను పిలిపించుకుని పార్టీలో చేర్చుకున్నారంటారు.
అప్పటి నుంచి ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స శకం మొదలైంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపులో బొత్స కీలక పాత్ర పోషించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల పాత్ర పెరిగింది. బొత్స సత్యనారాయణ లాంటి వారి సేవలను జగన్ పార్టీ పరంగా వినియోగించుకోలేదు. అందుకే ఉత్తరాంధ్రలో పార్టీ తుడుచుపెట్టుకుపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అది గుర్తించిన జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
తాజాగా బొత్స విశాఖ శాసనమండలి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అయినా కూటమి అభ్యర్ధి ఎమ్మెల్సీ బరిలోకి దిగి ఉంటే బొత్సాకి కష్టాలు తప్పేవి కాదంటున్నారు. కూటమి పోటీ కి దూరంగా ఉండటం బొత్సకు నెత్తిమీద పాలుపోసినట్లైంది. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స ప్రమాణస్వీకారం తంతు కూడా కానిచ్చేశారు …
బొత్స తన ప్రమాణస్వీకారానికి ముందే తనదైన మార్క్ రాజకీయం మొదలుపెట్టేశారు. సత్తిబాబు అలా మండలిలో అడుగుపెట్టారో లేదో .. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. తాను పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి గా, పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నానని రానున్న రోజుల్లో తనకుకు పార్టీలో మరిన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి .. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: అచ్యుతాపురం ప్రమాదస్థలానికి సీఎం చంద్రబాబు.. ఫార్మా క్షతగాత్రులకు పరామర్శ
బొత్స సత్యనారాయణ ను మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే మంచి జరుగుతుందని భావిస్తున్నానని తన అభిప్రాయాన్ని జగన్ ఆమోదించారని అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు. మరి బొత్స ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన కంటే సీనియర్ అయిన మాజీ కేంద్రమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి అప్పుడు జగన్కి, అప్పిరెడ్డికి పార్టీ ప్రయోజనాలు గుర్తుకు రాలేదు. కాని బొత్స ఎంట్రీ ఇవ్వగానే అప్పిరెడ్డి సైడ్ అయిపోయి. ప్రతిపక్ష నేతకు వచ్చే కేబినెట్ హోదా త్యాగం చేశారు.
ఇదంతా బొత్స సత్తిబాబు మార్క్ రాజకీయమే అంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడైన ఆయన ముందే ప్రతిపక్ష నేత హోదాపై కన్నేశారంట. అప్పటికే శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని జగన్ నియమించారు. అయితే అప్పిరెడ్డిపై రౌడీషీటర్ ముద్ర ఉంది. గుంటూరులో రౌడీయిజం చెలాయించారని కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి కింద బొత్స పనిచేసే ఛాన్స్ లేదు. అందుకే కచ్చితంగా శాసనమండలి పక్ష నేతగా పదవి కావాలని పట్టుబట్టారంట.. జగన్ కూడా ఆ పదవి ఇస్తానని చెప్పి బొత్సను పోటీలో పెట్టారు.
ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదాను బొత్స దక్కించుకోనున్నారు ..ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. 39 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభ పక్ష నేత అంటే క్యాబినెట్ హోదాతో సమానం. శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ ప్రతిపక్ష నేత హోదాకు డిమాండ్ చేసినా.. స్పీకర్ లెక్క చేయడం లేదు. భవిష్యత్తులో సైతం ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఆ హోదా కోసం జగన్ న్యాయపోరాటం కూడా మొదలుపెట్టారు.
అప్పిరెడ్డికి కేబినెట్ హోదా దక్కినప్పుడే జగన్ జీర్ణించుకోలేకపోయారంట. ఇప్పుడు సమీకరణలు మారిపోయి బొత్స ఆ చాన్స్ కొట్టేస్తున్నారు. అంటే అసెంబ్లీలో వైసీపీకి బొత్స పెద్దదిక్కుగా మారనున్నారు.. మరి జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.