First Time MLA’s in Srikakulam District: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 164 సీట్లలో గెలిచి.. భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ రికార్డులు సృష్టించాయి. ఊహించని రీతిలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో.. ఆ పార్టీ నేతలెవరూ మీడియా కంట పడలేదు. జగన్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి.. ఓటమికి కారణాలేమిటో తెలియడం లేదని వాపోయారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి నుంచి పోటీ చేసి తొలిసారి గెలిచిన వారు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో.. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గొండు శంకర్, పలాస నుంచి గౌతు శిరీష, పాతపట్నం నుంచి మామిడి గోవిందరావు, ఎచ్చెర్ల నుంచి నడకుదిటి ఈశ్వరరావు మొదటిసారి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. చివరి క్షణాల్లో ఎన్నికల బరిలోకి దిగినా.. ప్రజాభిమానంతో గెలిచారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టో, అగ్రనేతల సపోర్ట్ వీరి విజయాలకు కారణాలుగా నిలిచాయి.
శ్రీకాకుళంలో తొలిసారి కూటమి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గొండు శంకర్ చేతిలో రాజకీయ దురంధరుడైన మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్తుగా ఓడిపోయారు. ధర్మానకు 64,570 ఓట్లు రాగా.. గోండు శంకర్ కు 1,17,091 ఓట్లు పోలయ్యాయి. 52,521 ఓట్ల మెజార్టీతో గోండు శంకర్ విజయం సాధించారు. 1952 నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళంలో ఈ విజయం ఒక నూతన అధ్యాయమనే చెప్పాలి. శంకర్ 2014 నుంచి 2019 వరకూ ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేసి.. 2021లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు.
Also Read: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బావ బావమరిది, మామ అల్లుళ్లు
సిక్కోలు శివంగిగా పేరొందారు గౌతు శిరీష. ఈమె స్వాతంత్ర్య సమరయోధుడైన దివంగత గౌతు లచ్చన్న మనవరాలు, మాజీ మంత్రి శ్యామసుందర శివాజీ కుమార్తె కూడా. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సీదిరి అప్పలరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా సరే వెనుకడుగు వేయలేదు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు, అరాచకాలు, అవినీతి, అక్రమాలపై పోరాడి.. సిక్కోలు శివంగి అనిపించుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఆమె ఎత్తిన గళమే.. విజయానికి దారివేసింది. మంత్రి సీదిరి అప్పలరాజుకి 61,210 ఓట్లు రాగా.. గౌతు శిరీషకు 1,01,560 ఓట్లు వచ్చాయి. ఆయనపై 40,350 ఓట్ల మెజార్టీతో గెలుపొందారామె.