Rapaka: ఏపీ ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్ఠానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సీఎం జగన్ సస్పెండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ తనను కోరిందని వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని వరప్రసాద్ తెలిపారు. తన స్నేహితుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు జరిపారని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీకి ఓటేయాలని తనను కోరారన్నారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్తుతో పాటు మంచి పొజీషన్ ఇస్తామన్నారని తెలిపారు.
కానీ ముఖ్యమంత్రి జగన్పై ఉన్న నమ్మకంతో టీడీపీ ఆఫర్ను తిరస్కరించానని రాపాక వెల్లడించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేమన్నారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ. 10 కోట్లు వచ్చేవన్నారు. కానీ తాను అలా చేయలేదని, టీడీపీ ఆఫర్ను తిరస్కరించానని వెల్లడించారు.