MLC Election : ఏపీలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ ఒక్కరిని పోటీకి దించింది. సంఖ్యాబలం ఆధారంగా వైసీపీకి ఆరుస్థానాలు దక్కడం ఖాయం. ఏడోస్థానం విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య పోటా పోటీ ఉంది. ఈ స్థానం ఎవరి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.
ఏపీ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీకి అధికారికంగా 23 మంది సభ్యులు ఉన్నారు. జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైసీపీ నుంచి పోటీలో ఉన్న ఏడుగురు గెలుపొందాలంటే 154 మంది సభ్యులు కావాలి. కానీ 151 మంది సభ్యులు మాత్రమే వైసీపీకి అధికారికంగా ఉన్నారు. అయితే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరిధర్ ఎప్పటి నుంచో వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీవైపే ఉన్నారు. దీంతో వైసీపీకి 156 మంది మద్దతు ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ఈ మధ్య ఆ పార్టీకి రెబల్స్ గా మారారు. ఆ ఇద్దరు ఎటు ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసినా 154 సభ్యుల మద్దతు ఉండటంతో ఏడు స్థానాలను గెలిచే అవకాశం వైసీపీకి ఉంది.
మరోవైపు టీడీపీకి అధికారికంగా 23 మంది సభ్యులున్నారు. గెలవాలంటే 22 ఓట్లు రావాలి. కానీ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఉన్నారు. దీంతో టీడీపీ బలం 19కు తగ్గింది. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయిన సరే టీడీపీ అభ్యర్థి విజయానికి ఒక ఓటు తక్కువగా ఉంటుంది. అయితే వైసీపీకి మద్దతు తెలుపుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరు టీడీపీకి ఓటేసినా గెలిచే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. వైసీపీలో పనితీరు ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారి మద్దతు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
వైసీపీ అభ్యర్థులు: పెనుమత్స సూర్యనారాయణ, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం
టీడీపీ అభ్యర్థి: పంచుమర్తి అనురాధ
వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్ –1లో ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి ఏడు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందా..? టీడీపీ సంచలన విజయం నమోదు చేస్తుందా..?