KotamReddy: అధికారంలో ఉన్న పార్టీలో క్రమశిక్షణ కాస్త బెటర్ గా ఉంటుంది. బాస్ కన్నెర్ర జేస్తారని ఎమ్మెల్యేలు బుద్ధిగా ఉంటారు. వైసీపీలో ఆ క్రమశిక్షణ కాస్త ఎక్కువే. రఘురామ మినహా పార్టీ నేతలంతా తాడేపల్లికి కట్టుబడి ఉంటారు. ఇటీవల నెల్లూరు పెద్ద కాపు.. ఆనం రాంనారాయణరెడ్డి కాస్త వాయిస్ రెయిజ్ చేశారు. అంతే, వెంటనే యాక్షన్ మొదలైపోయింది. నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించేశారు. లేటెస్ట్ గా, నెల్లూరు రూరల్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాయిస్ మరింత రీసౌండ్ ఇస్తోంది. ఆనం కంటే గట్టిగానే రెబెల్ కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. సోమవారం నియోజకవర్గ కార్యకర్తలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఏం చేద్దాం అంటూ వారితో చర్చించారు. ఇన్నాళ్లూ అవమానాలు భరించా.. ఇక భరించలేనంటూ గట్టిగా వాయిస్ వినిపించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. తన మనోభావాలు దెబ్బ తీశారంటూ.. మీడియా సాక్షిగా ఐబీ సిబ్బందిపై కోటంరెడ్డి మండిపడటం కలకలం రేపింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తనకు ఏ మంత్రి పదవో, స్పీకర్, ఉపసభాపతి, చీఫ్ విప్, విప్, చివరికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అయినా వస్తుందని ఆశించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కానీ, వీటిలో ఏ ఒక్కటి దక్కలేదు. ఇటీవలి కేబినెట్ విస్తరణలో తనను కాదని.. జిల్లాకు చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డిని మినిస్టర్ చేయడంపై లోలోన రగిలిపోతున్నారు. ఆ మంట ఇప్పుడిలా సెగలా ఎగిసిపడుతోందని అంటున్నారు.
ఇటీవల వరుసగా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కోటంరెడ్డి. నెల్లూరు రూరల్లో 2,700 పెన్షన్లు తొలగించడంపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి రావత్పైనా కామెంట్లు చేశారు. తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై కోటంరెడ్డి చేపట్టిన నిరసన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్వయంగా ఆయనే మురుగు కాలువలోకి దిగి నిరసన తెలపడంతో వైసీపీ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఓవైపు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నడుస్తుండగా.. దానికి పోటీగా అన్నట్టుగా ‘తటస్థుల దీవెన’ అంటూ సొంతంగా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నారు. ఇలా వరుస పరిణామాలతో సీరియస్ గా ఉన్న సీఎం జగన్.. ఇటీవలే తాడేపల్లి పిలిపించుకుని మరీ కోటంరెడ్డితో మాట్లాడారు. అంతే ఓకే అనుకుంటుండగా.. మళ్లీ ఫోన్ ట్యాపింగ్ అంటూ కలకలం రేపారు. కార్యకర్తలతోనూ భేటీలు నిర్వహిస్తున్నారు.
మరి, ప్రజాబలం దండిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డిని వైసీపీ అధిష్టానం మరింతకాలం భరిస్తుందా? ఆనంలానే శిక్షిస్తారా? లేదంటే, ఆయనే తప్పుకుంటారా?