Kolusu Parthasarathy : ఏపీలో మరో రెండు నెలల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయపార్టీలు అభ్యర్థుల ఎంపికలపై కసరత్తులు చేస్తున్నాయి. వైసీపీ నుంచి మూడు లిస్టులు రాగా.. సిట్టింగులకు ఊహించని షాకులే తగిలాయి. ఇప్పటికే ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగాయి. కీలక నేతలకు సీటివ్వకుండా మొండిచేయి చూపడంతో.. సీటు ఆశించిన వారితో పాటు.. వారి అనుచరులు వైసీపీపై గుర్రుగా ఉన్నారు. కొందరు పార్టీ మారే ఆలోచనలో పడ్డారు.
తాజాగా విడుదలైన లిస్టులో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి (kolusu parthasarathy) కి కూడా సీటు లేదని చెప్పకనే చెప్పింది. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగిరమేశ్ (Jogi Ramesh) ను నియమించింది అధిష్టానం. ఈ క్రమంలో కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? అని ప్రశ్నించారు.
వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడమంటే.. నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీలో బలహీనవర్గాలకు గుర్తింపు ఉంటుందని గతంలో తానే చెప్పానని, అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదన్నారు. బీసీ, ఎస్సీలు ఎవరికాళ్లపై వారు నిలబడాలని అనుకుంటారని, మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే నాలా ఆత్మాభిమానాన్ని చంపుకోరని ఆయన వ్యాఖ్యలు చేశారు.
కాగా.. అధికార వైసీపీకి మరో షాక్ తగలనుంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి సాయంత్రం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ నెల 21న ఆయన టీడీపీ(TDP) లో చేరనున్నారు. పార్థసారథిని ఆపడం కోసం వైసీపీ చివరి వరకు ప్రయత్నించినా.. అవేవీ ఫలించలేదు. ప్రయత్నాలు బెడిసికొట్టడంతోనే పెనమలూరుకు జోగి రమేష్ ను ఇంచార్జ్ గా నియమించింది. దీంతో ఇక పార్టీలో ఉండేది లేదని పార్థసారథి నిర్ణయించుకున్నారు.